వెలుగు కార్యాలయం ఎదుట వీవోఏల ఆందోళన | VOAs dharna in Bapatla District: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వెలుగు కార్యాలయం ఎదుట వీవోఏల ఆందోళన

Nov 12 2024 5:41 AM | Updated on Nov 12 2024 5:41 AM

VOAs dharna in Bapatla District: Andhra pradesh

బాపట్ల జిల్లా జే.పంగలూరులో ఘటన

కూటమి నాయకుల సిఫార్సులతో వీవోఏల తీసివేత

ఇప్పటి వరకు 18 మంది తొలగింపు

24 గంటల సమ్మె చేపట్టిన వీవోఏలు, డ్వాక్రా మహిళలు

జే.పంగులూరు: టీడీపీ కూటమి నేతల బెదిరింపులే లక్ష్యంగా 18మంది వీవోఏలను అక్రమంగా తొలగించారని నిరసన తెలుపుతూ వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు సోమవారం మండల వెలుగు కార్యాలయం ముందు నిరవధిక ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకూ 24 గంటలు వెలుగు కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మండలంలో 38మంది వీవోఏలు ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జీతాలున్నా, లేకున్నా గ్రామంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధులు పెంచేందుకు తమ వంతు సాయి అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వాలు ఎన్నిమారినా ఎవరూ తొలగించేవారు కాదనీ, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే 18మంది వీవోఏలను నిర్ధాక్షిణ్ణ్యంగా ఎలాంటి సమాచారం, గ్రూపు సభ్యుల తీర్మానాలు లేకుండా, వారి సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన వ్యక్తికి మద్దతు తెలపకుంటే ఇంటికి వచ్చే పథకాలు రద్దు చేస్తామని ఒత్తిడి చేసి డ్వాక్రా మహిళలతో వారికి ఇష్టం లేకుండా సంతకాలు చేయించుకుని వారికి నచ్చిన వారిని వీవోఏలుగా నియమిస్తున్నారని వాపోయారు.

అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్‌బాబు, సీఐటీయూ మండల కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి రామారావుతో కలిసి మండల సమైక్య అధ్యక్షురాలు బాచిన నాగలక్ష్మీ, వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు తహసీల్దార్‌ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement