
చంద్రబాబు సర్కారు రెడ్బుక్ పాలనపై వైఎస్ జగన్ నిప్పులు
మన రాజకీయ జీవితం అంతా.. ప్రజలు అధికారం ఇస్తేనే తీసుకున్నాం
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతోనే మొదలైంది..
ముఖ్యమంత్రి అయ్యాక తానే దగ్గరుండి రాజ్యాంగాన్ని తగలబెడుతున్నాడు
పోలీసులను వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారు.. వారి సమక్షంలోనే దౌర్జన్యాలు
రాక్షస పాలన ఎలా చేయాలో నేర్పుతా.. రాష్ట్రమంతా టీడీపీ వాళ్లు ఇలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతాలిచ్చారు
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు చూపిన తెగువ, నిబద్ధతకు హ్యాట్సాఫ్
వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం
జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తా
‘‘రాజకీయాలంటే నీ మాదిరిగా చేయడం కాదు..! ఎంపీటీసీలమైనా, జెడ్పీటీసీలమైనా మమ్మల్ని చూసి నేర్చుకో..! విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టే రాజకీయమంటే ఇదీ..! అని చంద్రబాబు నాయుడుకు మీరంతా గట్టిగా చాటి చెప్పారు. గొప్ప తెగువ ప్రదర్శించారు. విలువలు, విశ్వసనీయత పట్ల చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా’’ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రెడ్ బుక్, రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మార్కాపురం ఎంపీపీ, ఎంపీటీసీలు, గాండ్లపెంట ఎంపీటీసీలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లతోపాటు ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే..
మనకు, చంద్రబాబుకు తేడా ఇదీ...
మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలల పాలనలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మన రాజకీయ జీవిత ప్రస్థానం అంతా ప్రజలు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. ఏనాడూ దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి రాజకీయాలు చేయలేదు. అదే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలవుతుంది. బిడ్డను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి మొదలుపెడితే అధికారం కోసం జీవితమంతా వెన్నుపోట్లు పొడుస్తూనే రాజకీయాలు సాగిస్తూ వచ్చారు.
స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు..
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఆరింట వైఎస్సార్సీపీ గుర్తు మీద గెల్చారు. టీడీపీ గుర్తుతో ఒక్కరే నెగ్గారు. అలాంటప్పుడు ఎంపీపీ పదవి కచ్చితంగా వైఎస్సార్సీపీకే రావాలి. ఒక్కడే ఉన్న టీడీపీకి ఎలా వస్తుంది? అక్కడ ఏం జరిగిందో మనమంతా చూశాం. యుద్ధ వాతావరణం సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్మెన్లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు చేస్తున్నారు. మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్కాట్ చేసి వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే సర్దుబాటు చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తున్నాం.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ కూడా ఎంపీపీ మనకే రావాలి. పోలీసులు బెదిరించడంతో అయినా మనం క్యాంపులు పెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి పార్టీల నాయకులు సూట్కేసులతో ప్రలోభాలు పెట్టారు. అక్కడ మనవాళ్లు అంతా గట్టిగా ఒక్కటిగా నిలబడ్డారు. ఎవరూ జారిపోలేదు. మీ అందరి తెగువకు హ్యాట్సాఫ్ చెప్పాలి.

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లలో 26 మంది మన పార్టీ గుర్తు మీద గెల్చారు. మరి అక్కడ మున్సిపల్ ఛైర్మన్గా వైఎస్సార్సీపీ గెలవాల్సి ఉండగా రకరకాల ప్రలోభాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మనవాళ్లు గట్టిగా నిలబడ్డారు.
కుప్పం మున్సిపాల్టీని చూస్తే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకుగాను వైఎస్సార్సీపీ 19 గెలిచింది. టీడీపీ కేవలం 6 మాత్రమే నెగ్గింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అది
స్థాయిలో అంటే.. మున్సిపల్ ఛైర్మన్ను బెదిరించి రాజీనామా చేయించి వాళ్ల పార్టీలోకి తీసుకున్నారు. చంద్రబాబు అంతటితో ఆగిపోకుండా... ఇది కుప్పం...! నా నియోజకవర్గం.. నేను ముఖ్యమంత్రిని.. నేను ఒక రాక్షసుడిని.. రాక్షస సామ్రాజ్యానికి రాజుని.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతా.. రాష్ట్రమంతా తెలుగుదేశం వాళ్లు ఇలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతాలు ఇచ్చాడు..! అలా సంకేతాలు ఇచ్చి బలవంతంగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు.
కేవలం 6 స్థానాలు మీరు (టీడీపీ) గెలిస్తే.. 19 స్థానాలు మేం గెలిచాం. అయినా కుప్పం చైర్మన్ మీదేనని చెప్పుకుంటున్నారు. ఒక్కో కౌన్సిలర్కు రూ.50 లక్షలు ఇచ్చి మీవైపు తిప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఇదా చంద్రబాబూ? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. రాజ్యాంగం అనేది భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి లోబడి ఉంటానని చెబుతాడు.
కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి రాజ్యాంగాన్ని తగలబెడుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. 19 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుంచి గెలిచినా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం నిలిచింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కుప్పాన్ని మున్సిపాల్టీగా చేయాలన్న ఆలోచనే రాలేదు.
కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకు ఏరోజూ తట్టలేదు. రెవెన్యూ డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి తాగు నీళ్లు కూడా ఇవ్వలేదు. అది కూడా మన హయాంలోనే చేశాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో... తెగువ చూపించి నిలబడిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.
జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట..
ఇంతకు ముందు మన ప్రభుత్వ హయాంలో బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు చేయలేకపోవచ్చు. జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేస్తే.. తదుపరి మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువగా ధ్యాస పెట్టి పాలన నడపాల్సి వచ్చింది.
కార్యకర్తలు పడుతున్న కష్టాలను మీ జగన్ చూశాడు. మీరు చూపిస్తున్న తెగువను కూడా మీ బిడ్డ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నా. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తా. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మళ్లీ మనమే అఖండ మెజార్టీతో వస్తాం.