పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌

Published Mon, Mar 10 2025 10:53 AM | Last Updated on Mon, Mar 10 2025 10:49 AM

పర్చూ

పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌

పర్చూరు(చినగంజాం): పర్చూరు కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా కొల్లా నరేంద్ర కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు అద్దంకి ఏజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై పర్చూరు కోర్టు ఏజీపీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పర్చూరు కోర్టులో వై. రమేష్‌ బాబు ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పర్చూరు కోర్టు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్‌ జె. వెంకట మురళి ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా ఎడ్లకు ప్రథమస్థానం

రాజుపాలెం: ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమ వారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఒకేసారి 220 ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల తయారీ

గుంటూరు ఎడ్యుకేషన్‌: 220 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్‌ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్‌ చివుకుల హనుమంతరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్‌ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ మైండ్స్‌’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్‌ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్‌ అకాడమీ సీఈవో డాక్టర్‌ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్‌ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌ 1
1/2

పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌

పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌ 2
2/2

పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement