
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా యూపీఐ ఇంటరాపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. వ్యాపారుల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ ఎండీ కె. సత్యనారాయణ రాజు తెలిపారు.
అలాగే ప్రత్యేకంగా సీబీడీసీ బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ప్రస్తుతం తమకున్న యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే వ్యాపారులు డిజిటల్ కరెన్సీలో చెల్లింపులను పొందవచ్చని ఆయన వివరించారు. అనుసంధానించిన ఖాతా నుంచి కస్టమర్లు తమ సీబీడీసీ వాలెట్లోకి కరెన్సీని లోడ్ చేసుకోవచ్చని, దాన్ని సీబీడీసీ వాలెట్ ఉన్న ఎవరికైనా బదలాయించవచ్చని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, స్వీకరించవచ్చని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో దీన్ని కస్టమర్లు, వ్యాపారులకు పైలట్ ప్రాతిపదికన దీన్ని ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు.