
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఈ అదనపు సెలవులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీనా.. లేక ప్రత్యేకంగా కొంతమందికేనా అన్న గందరగోళం నెలకొంది.
అవయవ దాతలకు సెలవులు
వాస్తవంగా అవయవాలను దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 42 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 2న లోక్సభ ప్రకటనలో తెలియజేశారు. ఈ సెలవులను శస్త్రచికిత్సకు ముందు, ఆసుపత్రిలో చేరినప్పుడు, రికవరీ సమయంలో వినియోగించుకోవచ్చు. ఇది అన్ని అవయవ దాన శస్త్రచికిత్సలకూ వర్తిస్తుంది. అలాగే ఇది వైద్య సిఫార్సుల ఆధారంగా వన్-టైమ్ బెనిఫిట్. ఏటా ఇచ్చే సెలవులు కాదు. ఇది అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న చొరవ. సాధారణ సెలవు విధానం కాదు.
ఏటా 42 అదనపు సెలవులు?
పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 42 అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుండి అమలులోకి వస్తోందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. పని-జీవిత సమతుల్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత క్యాజువల్, ఆర్జిత, వైద్య సెలవులకు అదనంగా ఈ లీవ్స్ను ప్రభుత్వం ఇస్తోందంటూ నివేదించాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ధ్రవీకరణ రావాల్సి ఉంది.