
నూతన సంవత్సరం తొలి రోజున రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు సంతోషం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
గతేడాది మేలో బెంగాల్తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసింది మొదలు వరుసగా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోయింది కేంద్రం. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రూ. 400లకు వరకు ధరను పెంచింది. చివరి సారిగా 2021 డిసెంబరు 1న రూ.100 వంతున సిలిండర్ ధర పెంచింది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల నలువైపుల నుంచి విమర్శలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఆయిల కంపెనీలకు ధరల తగ్గింపుపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ కీలకమైన యూపీ ఎన్నికలు సమీపించడంతో తొలిసారిగా గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే దిశగా ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
2022 జనవరి 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వంతున తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2004కి చేరుకోగా కోల్కతాలో రూ.2,074, చెన్నైలో రూ.2134, ముంబైలో రూ.1951కి చేరుకుంది.