ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్‌! | Sakshi
Sakshi News home page

విమానయానం.. అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు

Published Fri, Apr 26 2024 11:35 AM

Passengers Deserve To Get Their Money Back When Airline Owes Them Without Haggling

విమాన ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్‌లను ఆటోమేటిక్‌గా చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చాలాసమయాల్లో విమానాలను రద్దుచేస్తుంటారు లేదా వాటిని ఏదో కారణాలతో మళ్లిస్తుంటారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటికే వారు తీసుకున్న టికెట్‌ ధర తిరిగి చెల్లించేందుకు కొన్నిసార్లు విమాన సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారికి ఆటోమేటిక్‌గా రీఫండ్‌ వచ్చేలా సదుపాయం కల్పిస్తున్నారు.

కార్పొరేట్ల అనవసరపు రుసుముల నుంచి ప్యాసింజర్లను రక్షించేందుకే కొత్త నిబంధనలు తీసుకున్నట్లు బైడెన్‌ కార్యవర్గం బుధవారం తెలిపింది. విమానయాన సంస్థ ప్రయాణికులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వెంటనే రీఫండ్‌ చేయాలని యూఎస్‌ రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త నిబంధనలు ఇలా..

  • ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్‌లను ఆటోమేటిక్‌గా చెల్లించాలి.

  • దేశీయ విమానాలు 3 గంటలు, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల్లో 6 గంటలు అంతరాయం ఉంటే రీఫండ్‌కు అర్హులు.

  • మొదట కొనుగోలు చేసిన దాని కంటే తక్కువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేయడం. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి పంపిస్తే రీఫండ్‌ పొందవచ్చు.

  • ఏదైనా కారణాలవల్ల చేరుకునే లేదా బయలుదేరే విమానాశ్రయంలో మార్పులుంటే అర్హులు.

  • దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే రీఫండ్‌ పొందవచ్చు.

  • దేశీయ విమానాలు విమానాశ్రయంలో దిగాక నిర్దేషించిన సమయంలోపు బ్యాగేజ్‌ డెలివరీ చేయకపోతే ప్రయాణికులు తనిఖీ చేసిన బ్యాగ్ ఫీజు వాపసు పొందవచ్చు. 

  • విమానంలో వైఫై లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి సేవల కోసం ఎవరైనా డబ్బు చెల్లించి వాటిని పొందకపోతే తిరిగి తమ డబ్బును రీఫండ్‌ కోరవచ్చు.

ఇదీ చదవండి: ఎంత దూరం నుంచైనా జనరల్‌ టికెట్‌

2020లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఎయిర్‌లైన్స్, టిక్కెట్ ఏజెంట్లు ప్రయాణికుల రీఫండ్‌లను తిరస్కరించారని పెద్దమొత్తంలో ఫిర్యాదులు అందాయి. రీఫండ్‌ ఆలస్యం అవుతుందని కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలా ఎయిర్‌లైన్స్‌ శాఖకు అందిన విమాన ప్రయాణ సర్వీస్ ఫిర్యాదుల్లో 87% రీఫండ్‌కు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. దాంతో స్పందించిన ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది.

Advertisement
Advertisement