![Sensex ends 95 points higher and Nifty near 11,250 points - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/1/SENSEX.jpg.webp?itok=8YLC59TR)
చివరి వరకూ లాభనష్టాల మధ్య, ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన బుధవారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్పలాభాలతో గట్టెక్కింది. కొన్ని ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడం, డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 73.76 వద్దకు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, పై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు పెరిగి 38,068 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద ముగిశాయి.
మెప్పించని తొలి డిబేట్....
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్ ప్రపంచ మార్కెట్లను మెప్పించలేకపోవడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన మార్కెట్ లాభాల్లో మొదలైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. చివరి వరకూ పరిమిత శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలాడింది. ఒక దశలో 145 పతనమైన సెన్సెక్స్ మరో దశలో 263 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 408 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టెక్ మహీంద్రా 3 శాతం లాభంతో రూ.790 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఎస్కార్ట్స్, రామ్కో సిస్టమ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి.
Comments
Please login to add a commentAdd a comment