
నేడు (3న) దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 97 పాయింట్లు జంప్చేసి 11,770 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 11,673 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారం యూఎస్ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ నేడు మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
లాభాలతో
సోమవారం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించ దగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు బలపడి 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పుంజుకుని 11,669 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 11,726- 11,557 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,576 పాయింట్ల వద్ద, తదుపరి 11,482 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,744 పాయింట్ల వద్ద, ఆపై 11,819 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 24,296 పాయింట్ల వద్ద, తదుపరి 23,699 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 25,314 పాయింట్ల వద్ద, తదుపరి 25,736 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 741 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 534 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 631 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.