
న్యూఢిల్లీ: నియంత్రణ పరమైన నిబంధనల అమలులో విఫలమైన కేసును స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ పరిష్కరించుకుంది. సెబీకి రూ.25 లక్షలు చెల్లించడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలికింది.
‘‘ప్రతిపాదిత ఉల్లంఘనల ఆరోపణల విషయంలో పరిష్కారానికి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ సెబీని సంప్రదించింది. సెబీ గుర్తించిన వాస్తవాలను అంగీకరించ లేదు. అలా అని తిరస్కరించ లేదు. నిబంధనల అమలులో వైఫల్యాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న చర్యలపై దరఖాస్తుదారుతో పరిష్కారం కుదిరింది’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 2015 ఏప్రిల్ నుంచి ఆర్బీఐ వద్ద నమోదిత సంస్థగా ఉంది. 2019 ఆగస్ట్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఐపీవో ద్వారా లిస్ట్ అయింది. ఆడిటర్ విషయంలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ సంస్థ, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్ నిబంధనల అమలులో విఫలమైందన్నది సెబీ ఆరోపణగా ఉంది.