
ముంబై: కస్టమర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీనితో మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు మరింతగా విస్తరించినట్లవుతుందని పేర్కొంది. ఈ 100 డిజిటల్ ఆధారిత శాఖల్లో ఇప్పటికే 60 బ్రాంచీల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగతావి నవంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ నవీన్ తహిలియాని వివరించారు. ఏజెన్సీ పంపిణీ వ్యవస్థ లేని 70 ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటైనట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు.