15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌ | 15 ganja smugglers arrested | Sakshi
Sakshi News home page

15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

Published Sat, Jul 20 2024 4:30 AM | Last Updated on Sat, Jul 20 2024 4:30 AM

15 ganja smugglers arrested

గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

90.5 కేజీల గంజాయి స్వాధీనం

విజయవాడ డీసీపీ హరికృష్ణ వెల్లడి

విజయవాడస్పోర్ట్స్‌:   ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగం అరెస్ట్‌ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. 

యాంటి నార్కోటిక్‌ సెల్, టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ వివరాలను విజయవాడ కమాండ్‌కంట్రోల్‌ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.

ప్రధాన నిందితుడు పింక్‌రౌత్‌..
పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్‌ను అరెస్ట్‌ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్‌రౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. 

విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్‌ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్‌ మొహమ్మద్‌ గౌస్‌ అబ్దుల్‌ హబీబ్, విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన కొమ్ము రాకేశ్,  విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్‌ ముజ్జమిల్‌ సుల్తాన్, షేక్‌ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్‌రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

 వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.  టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement