
భోపాల్: మధ్యప్రదేశ్లోని ధార్లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది.
ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్కి చెందినది.
అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: బెలూన్లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి)