
ప్రతీకాత్మక చిత్రం
పిడుగురాళ్ల: ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్పై రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు.
బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకిలేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతో పాటు, శరీరం కూడా తగలబడుతోంది. అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య దీనిని గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ పోలయ్య, ఏఎస్ఐ కె.క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment