
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనంతపురం: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని చిన్నారులిద్దరిపై ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. చిత్రహింసలకు గురిచేశాడు. చివరికి చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని రక్షించారు. గుంతకల్లులో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గుంతకల్లుకు చెందిన ఓ వ్యక్తి అప్పుల బాధతో నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. అనంతరం భార్య తన ఇద్దరు పిల్లలను గుంతకల్లులోని పుట్టింట్లో వదిలేసి అనంతపురానికి చేరుకుంది. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వేతనంపై పనిచేస్తోంది.
ఈ క్రమంలోనే పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అప్పుడప్పుడూ గుంతకల్లుకు వెళ్లి తన పిల్లలను చూసి వస్తుండేది. ఈ క్రమంలోనే వారం కిందట ప్రియుడితో కలిసి గుంతకల్లుకు వెళ్లింది. అయితే పిల్లలిద్దరూ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన ఆమె ప్రియుడు.. మద్యం సీసాలు పగులగొట్టి, వాటిని బాగా వేడి చేసి వాటితో ఓ బాలుడి శరీరంపై వాతలు పెట్టాడు. మరో బాలుడి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ చిన్నారులు గట్టిగా కేకలు వేయగా.. ఇరుగూ పొరుగు వారొచ్చి పిల్లలను కాపాడారు.
చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే.. కన్నవారింట్లోనే..)
108 సాయంతో వారికి ప్రథమ చికిత్స చేయించి సురక్షిత ప్రాంతంలో ఉంచారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి పిల్లల తల్లిని విచారించారు. అయితే ప్రియుడిని కాపాడేందుకు ఆమె అబద్ధాలు చెప్పింది. పిల్లలకు భయం ఉండాలనే ఉద్దేశంతో తానే అలా హింసించానని చెప్పుకొచ్చింది. చివరికి చిన్నారులిద్దరినీ వారి మేనమామతో పంపించాలని పోలీసులు, పెద్దలు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment