'నువ్వు ఈ రాత్రి మాతో ఉంటే నీ భర్తను అప్పగిస్తాం' | Three Men Sexually Assault On Women In Jagtial District | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నడిరోడ్డుపై భర్తను బంధించి.. భార్యను చెరబట్టి!

Jan 17 2022 2:18 AM | Updated on Jan 18 2022 7:19 PM

Three Men Sexually Assault On Women In Jagtial District - Sakshi

కోరుట్ల: మద్యం తాగి ఉన్న భర్తను కారులో బంధించి.. శారీరకంగా లొంగితేనే భర్తను అప్పగిస్తామంటూ.. ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను బెదిరించి అర్ధరాత్రి నడిరోడ్డుపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య (36), ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈనెల 4వ తేదీన ఆ వ్యక్తి తన స్వగ్రామం చినమెట్‌పల్లికి వెళ్లాడు. అక్కడే బాగా కల్లు తాగాడు. మత్తులో ఉన్న అతడిని చూసిన అదే గ్రామానికి చెందిన నాగరాజు (26), తిరుపతి (24), రఘు (24).. కోరుట్లలో దింపుతామని తమ కారులో ఎక్కించుకున్నారు. తర్వాత అతడి భార్యకు ఫోన్‌చేశారు. ‘నీ భర్త మా దగ్గర ఉన్నాడు.. నువ్వు ఈ రాత్రి మాతో ఉంటే నీ భర్తను అప్పగిస్తాం’అని బెదిరించారు. తర్వాత రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భీమునిదుబ్బలోని బర్రెల మంద వద్దకు చేరుకున్నారు.

చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం..  ఫోన్‌ చేస్తే..)

మరోసారి ఆ వ్యక్తి భార్యకు ఫోన్‌ చేసి ఆ రాత్రి తమతో ఉండాలని బెదిరించారు. అయితే, తన భర్తను అప్పగించాక ఎలా చెప్తే అలా వింటానని బాధితురాలు బదులిచ్చింది. ఆ వెంటనే తమ బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేసింది. తన భర్తను కొందరు కిడ్నాప్‌ చేసి తనను బెదిరిస్తున్నారని, వెంటనే ఇంటికి రావాలని కోరింది. తర్వాత బర్రెల మంద వద్దకు వెళ్లింది. అక్కడ కారులో స్పృహ తప్పి ఉన్న భర్తను చూసి, తన భర్తను వదిలేయాలని నాగరాజు బృందాన్ని ప్రాధేయపడింది.

అయినా, వారు పట్టించుకోలేదు. అక్కడితో ఆగకుండా ఆమెపై లైంగికదాడికి యత్నించారు. మరో పక్క ఆ మహిళ పెనుగులాట దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అదే సమయంలో ఆమె బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది చూసిన నాగరాజు తదితరులు భార్యాభర్తలను కారులో ఎక్కించుకుని వారి ఇంట్లో దింపేలోపు బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై మరుసటిరోజు బాధిత వ్యక్తి తనను కిడ్నాప్‌ చేసి తనభార్యపై లైంగికదాడికి యత్నించారని ఆ ముగ్గురిపై కోరుట్ల ఎస్సై సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement