
లారీని ఢీకొన్న పెళ్లి కారు
ఉంగుటూరు: జాతీయరహదారిపై శుక్రవారం సాయంత్రం నాచుగుంట క్రాసింగ్ పాయింటు వద్ద లారీ–కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పాలకొల్లుకు చెందిన ఓ కుటుంబం పెళ్లి నిమిత్తం పెళ్లికొడుకుతో సహా ఏలూరు వెళ్తున్నారు. అయితే నాచుగుంట వద్ద ఏలూరు కాలువపై వంతెన మీద నుంచి రహదారి మీదకు ఒక్కసారిగా వచ్చిన క్వారీ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లంశెట్టి నాగమణి (65), కొల్లంశెట్టి నాగేశ్వరరావు(70), గంటాపద్మావతి (58), పసుమర్తి రాజేంద్వరప్రసాదు (38)కు తీవ్రగాయలు కాగా, జి.నవీన్ (34), పెళ్ళికొడుకు, ప్రవీణ్కుమార్(32) స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను హైవే అంబులెన్స్ ద్వారా ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోల్ ఫీజు మినహాయింపు కోసం ఉంగుటూరు బ్రిడ్జి మీదుగా నాచుగుంట వద్దకు అక్కడ నుంచి హైవేపైకి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్లకే పరిమితమైన ఉల్లంఘనలు ప్రస్తుతం క్వారీ లారీలు సైతం వస్తుండడంతో రోడ్లు పాడైపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా టోల్ అధికారులు ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆరుగురికి గాయాలు