మిల్లెట్‌ ఫ్యాక్టరీ.. ఆమెకు ఆర్థిక బలం | Women in Andhra Pradesh Thrive with Millet Factory | Sakshi
Sakshi News home page

మిల్లెట్‌ ఫ్యాక్టరీ.. ఆమెకు ఆర్థిక బలం

Dec 4 2024 1:30 AM | Updated on Dec 4 2024 1:30 AM

Women in Andhra Pradesh Thrive with Millet Factory

‘మిల్లెట్స్‌లో పోషకాలుంటాయి. అందుకే వాటిని పునర్వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు మహిళా రైతులు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే దారిలో మామిడిపాలెంలో మహిళలే నిర్వహిస్తున్న ‘మిల్లెట్‌ ఫ్యాక్టరీ’ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. పాడేరు, అరకు ఏజెన్సీలో పండే చిరుధాన్యాలనుప్రాసెస్‌ చేసి దేశమంతా మార్కెట్‌ చేయడమేకాక, చిరుధాన్యాలతో వివిధ రకాల రుచికరమైన వంటకాల కోసం రెస్టారెంట్‌ కూడా నిర్వహిస్తున్నారు.

పంట పండిన వెంటనే కొనడానికి తమను వెదుక్కుంటూ ఎవరూ రారని ముందే గుర్తించారు మామిడిపాలెం మహిళా రైతులు. పంట వేయడానికి ముందే మిల్లెట్స్‌కి మార్కెట్‌ ఎక్కడ ఉంది అని ఆరా తీశారు. ఆ విషయంలో ఒక ఎన్జీఓ వీరికి సహాయపడింది. మిల్లెట్స్‌ పండించినంత మాత్రాన ఆదాయం రాదని, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చినపుడే డిమాండ్‌ ఉంటుందని తెలుసుకున్నారు. దానికోసం వారి ఊరి మధ్యనే ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ పెట్టి చిరుధాన్యాలతో సేమియా, ఇడ్లీ, దోసె పిండి తయారు చేసి ΄్యాకింగ్‌ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ ఫ్యాక్టరీ సమీపంలో ఒక మిల్లెట్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి, సజ్జల జంతికలు, జొన్నల స్నాక్స్, అరికల అప్పడాల రుచి చూపిస్తున్నారు. 

ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి మార్కెట్‌ వాళ్లను వెతుక్కుంటూ వస్తుంది! ‘మన్యం గ్రెయిన్స్‌ ఫ్యాక్టరీ’ వల్ల ఏజెన్సీ రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించింది. మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చిరుధాన్యాలు పండించుకొని ఇక్కడేప్రాసెస్‌ చేయించుకొని లాభాలుపొందుతున్నారు. ఈ మిల్లెట్స్‌ మిల్‌ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండొందలకు పైగా మహిళలకు ఉపాధి దొరికింది. 

‘ఒకప్పుడు పశువులను మేపుకునే దానిని. మాకు దగ్గరే ఈ మిల్లెట్‌ ఫ్యాక్టరీ పెట్టాక ఇక్కడ పని దొరికింది. స్థిరమైన ఆదాయం వస్తోంది. దాంతో పిల్లలను చదివించుకుంటున్నాను’ అన్నారు మామిడిపాలేనికి చెందిన నూకరత్నం. ‘మాకు కొంతపొలం ఉన్నా దాని మీద వచ్చే పంటతో ఏడాదంతా బతకడం కష్టం అయ్యేది. కొన్నిరోజులు కూలి పనులకు వెళ్లేదానిని. అది కూడా అన్నిసార్లూ దొరికేది కాదు. ఈ ఫ్యాక్టరీలో చేరాకే మిల్లెట్స్‌ గొప్పతనం తెలిసింది. కనీస మద్దతు ధర దొరుకుతోంది’ అని సంతోషంగా చెప్పింది విజయ. వర్షాధార భూముల్లో అరుదైన సంపదను సృష్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చారు. సుస్థిర జీవనోపాధిపొంది ఏడాదికి రూ.కోటికి పైగా బిజినెస్‌ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన ఆత్మవిశ్వాసం, నమ్మకం సంపాదించారు.  – శ్యాంమోహన్‌

ఫ్యాక్టరీ ప్రత్యేకతలు
ఈ ఫ్యాక్టరీలో తొమ్మిది రకాల చిరుధాన్యాలుప్రాసెస్‌ చేస్తారు. బ్రాండెడ్‌ ΄్యాకింగ్‌ చేసి దాని మీద ఏ మిల్లెట్‌లో ఎలాంటి పోషకాలు ఉంటాయో స్పష్టంగా వివరాలిస్తారు ∙చిరు ధాన్యాలపై పోషకాలు ఎక్కువగా ఉండే లేయర్‌ తొలగించకుండా కేవలం పై పొట్టు మాత్రమే మర పట్టే యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. అందుకే మార్కెట్‌లో దొరికే వాటికంటే వీరి మిల్లెట్స్‌లో పోషకాలు ఎక్కువ. అన్నిరకాల మిల్లెట్స్‌ని ఇక్కడప్రాసెస్‌ చేయడం వల్ల రైతులు కూడా అన్ని రకాలు పండించడం మొదలు పెట్టారు. దీనివల్ల క్రాప్‌డైవర్సిటీ పెరిగింది.

ఒక అధ్యయనం తరువాత...
పాడేరు, అరకు ఏజెన్సీలో మిల్లెట్స్‌ ఉత్పత్తి పెరిగింది కానీ మార్కెటింగ్‌ సదుపాయాలు లేవు.ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేవు. అపుడొక అధ్యయనం చేసింది ‘వాస¯Œ  ’ స్వచ్ఛంద సంస్థ. సామలు, సజ్జలను ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కొని నాసిక్‌లోనిప్రాసెసింగ్‌ మిల్స్‌కి పంపుతున్నారు. అక్కడప్రాసెస్‌ చేసి వాటినే ఇక్కడికి తెచ్చి మన మార్కెట్‌లోకి అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల స్థానిక రైతులకు రేటు, తూకం దగ్గర మోసాలు జరుగుతున్నాయి. ఇదంతా గమనించాక సొంతంగాప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడితే స్థానికంగా రైతులకు మేలు జరుగుతుందని గుర్తించాం. మహిళలతో మిల్లెట్‌ ఫ్యాక్టరీప్రారంభించాం’ అంటారు మార్కెటింగ్‌ నిపుణుడు శ్రీనివాస్‌. ఈయన ముడిధాన్యాలను నాణ్యమైన ధాన్యాలుగా మార్చడంలో మహిళలకు సాంకేతిక సహకారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement