
అభిప్రాయం
మనకు తెలిసిన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పార్టీలే. కొందరు వాటిని గొప్పగా పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా పార్టీలు అనుకోవచ్చు. అప్పట్లో పీపుల్స్ వార్, ఇప్పట్లో సీపీఐ– మావోయిస్టు పార్టీ ఒక్కటే దీనికి భిన్నంగా ఉంటూ వచ్చింది. అది తన పరిధి పరిమితుల్లో సాయుధపోరాట పంథాను కొనసాగిస్తూ ఉండేది. ప్రస్తుతం దాని భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్టు పార్టీ కూడా ఎన్నికల పంథాను స్వీకరించవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి.
స్వాతంత్య్రానంతర కాలపు తొలి దశ రాజకీయాలు (Politics) వేరు. అవి ఎంతో కొంత సిద్ధాంతపరంగా ఉండేవి. వాటి ఆర్థిక విధానాలు ఆదర్శవంతంగా ఉండేవి. ఇటు వ్యవసాయ రంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టేది. ఇటు రైతు కూలీలు, అటు శ్రామికుల శ్రేయస్సు దిశగా కమ్యూనిస్టు పార్టీల కృషి సాగుతుండేది.
రాజకీయాల్లో కులమతాలకు ఒక పాత్ర, పెట్టుబడికి ఇంకో పాత్ర ఉంటుంది. మన ఆలోచనాపరులది ఒంటికన్ను వ్యవహారం. కులమతాల్ని చూసేవాళ్లు పెట్టుబడిని చూడలేరు; పెట్టుబడిని చూసేవాళ్లు కులమతాల్ని చూడలేరు. నిజానికి ఎన్నికల్లో కులమతాల కన్నా పెట్టుబడి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడయినా సరే పెద్ద పెట్టుబడి చిన్న పెట్టు బడుల్ని తనవైపు లాక్కుంటుంది. రాజకీయ కూటములు అలాగే ఏర్పడుతుంటాయి. దేశ తొలి ఎన్నికల్లో ప్రధాని నుండి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దాదాపు అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండే ఎన్నికయ్యారు. ఆ తరువాత వ్యావసాయిక కులాల్లో పెట్టుబడి పెరిగింది. సహజంగానే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనికి మారింది. ఆ తరువాత వెనుకబడిన తరగతుల్లోనూ పెట్టుబడి పోగవడం మొదలయింది. వాళ్ళూ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులయ్యారు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఎస్సీ, బీసీలకు అధికారం వచ్చిందనడం అర్ధసత్యం మాత్రమే! ఎస్సీ, బీసీ కులాల్లో పెట్టుబడి ఎక్కువగా పోగయిన కులాలకు, కుటుంబాలకు మాత్రమే అధికారం దక్కుతుంది. కులమతాలకూ, పెట్టుబడికీ ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోకపోతే వర్తమాన రాజకీయాలు అర్థం కావు.
1991లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలు వచ్చాక రాజకీయాలు ఫక్తు వాణిజ్య వ్యవహారంగా మారిపోయాయి. కొంతకాలం ఆశావహులుగా కొనసాగిన ఎస్సీ, బీసీ రాజకీయ పార్టీల్ని వాణిజ్య రాజకీయాలు గట్టిగా దెబ్బతీశాయి. స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుని బతికిన ముస్లిం సమూహానికి ఆర్థిక పునాది బీటలు వారడంతో ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. పైకి ఎంత వైవిధ్యపూరితంగా కనిపించినా సమస్త రాజకీయ పార్టీల గెలుపు మంత్రం ఒక్కటే; 20: 80! శత్రు వర్గం 20; సొంత వర్గం 80. 20 వాళ్ళు; 80 మనం!
ఓటర్లలో 20 శాతంగా ఉండే రాజవంశీకులు, బడా భూస్వాములకు తాను వ్యతిరేకం అని కాంగ్రెస్ చెప్పుకొనేది. మిగిలిన 80 శాతం ఓటర్లను ఎన్నికల్లో ఆకర్షించడానికి ఆ పార్టీ ప్రయత్నించేది. అది క్యాచ్మెంట్ ఏరియా; ఆరగాణి ప్రాంతం. అందులో సగం ఓట్లు పడినా విజయం తథ్యం. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఓటర్లల్లో 20 శాతంగా ఉండే పెట్టుబడిదారులు, భూస్వాములకు తాము వ్యతిరేకులమనీ, 80 శాతంగా ఉండే కార్మికులు, వ్యవసాయకూలీలకు తాము రక్షకులమనీ చెప్పుకొనేవి. 1990వ దశకంలో బహుజన రాజకీయాల్ని ముందుకు తెచ్చిన కాన్షీరామ్ కూడా దేశంలో పెత్తందారీ కులాలు 20 శాతం మాత్రమేననీ, 80 శాతం మంది బహుజనులనీ లెక్కలు కట్టి మరీ చెప్పేవారు.
భారతీయ జనతా పార్టీది కూడా సరిగ్గా అదే వ్యూహం. దేశంలో 20 శాతం మాత్రమే హిందూయేతరులు; 80 శాతం హిందువులు అనేది దాని విభజన. మనుషులకుండే సమస్త భావోద్వేగాల్లో మతం చాలా శక్తిమంతమైనది. ఈ 80 శాతం హిందువుల్లో 36 శాతం ఓట్లు పడినా అధికారం ఖాయం అని గత మూడు ఎన్నికల్లో బీజేపీ నిరూపించింది. మతభావోద్వేగాలనీ, కార్పొరేట్ శక్తుల్నీ, రాజకీయ అధికారాన్నీ మిళితం చేయడంలో బీజేపీ గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల్ని రచించడానికి దాదాపు అన్ని పార్టీలూ తలలు పగలగొట్టుకుంటున్నాయి. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి ఓటర్లలో 80 శాతాన్ని ఏకం చేసే బైండింగ్ వైర్ను కనిపెట్టడం అంత సులువు కాదు.
కమ్యూనిస్టులు, అంబేడ్కరైట్లు ఏకం అయితే (లాల్– నీల్ మైత్రి) బీజేపీని నిలవరించవచ్చు అనేది ఒక ఆలోచన. 2019 ఎన్నికల్లో దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్క లేదు. ఓటర్లు తిరస్కరించారు.
చదవండి: డాలర్ డ్రీమ్స్ ముగింపులో మరో కొత్త బంగారు లోకం
మరోవైపు, ఒక వ్యూహం ప్రకారం అంబేడ్కర్ను బీజేపీ క్రమంగా హైజాక్ చేసింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లోనే ఉనికిని కోల్పోయింది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఆ పార్టీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. దాదాపు మూడున్నర దశాబ్దాలు నిరాఘాటంగా పశ్చిమ బెంగాల్ను ఏలిన సీపీఎం 2021 ఎన్నికల్లో తనకున్న 26 సీట్లనూ కోల్పోగా బీజేపీ (BJP) అదనంగా 74 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టుల స్పేస్ను కూడా బీజేపీ ఆక్రమించుకుంటున్నది అనడానికి ఇదొక ఉదాహరణ.
అంబేడ్కరైట్లు, కమ్యూనిస్టులు కొత్తగా ఆదివాసులు, మైనారిటీలతో (లాల్ – నీల్ – హర్యాలీ) కలిసి నడిస్తే ఎమైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? అనేది ఒక కొత్త ఆలోచన. ముందు అలాంటి కూటమి ఏర్పడాలి. అంత పెట్టుబడి సమకూరాలి. ఆ తరువాత అది ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే ఎన్నికల వరకు ఇంకే మార్పులు వస్తాయో చూడాలి.
- డానీ
సమాజ విశ్లేషకులు