కోవిడ్‌పై చైనా నాలుగు దేశాలతో సంయుక్త సమావేశం | China Holds Meet With Four Countries To Jointly Fight Covid | Sakshi
Sakshi News home page

కోవిడ్‌పై సమరం: ఆ 4 దేశాలతో జతకట్టిన చైనా

Nov 13 2020 2:03 PM | Updated on Nov 13 2020 2:12 PM

China Holds Meet With Four Countries To Jointly Fight Covid - Sakshi

చైనా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఆర్ధికాభివృద్ది సాధించడానికి.. ‘రాజకీయ ఏకాభిప్రాయాన్ని’ పెంపొందించడానకి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక దేశాలతో చైనా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దీనిపై గురువారం చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం జులైలో జరిగిన అయిదు పార్టీల సమావేశానికి ఇది కొనసాగింపుగా పేర్కొంది. కోవిడ్‌-19ని సంయుక్తంగా నిర్మూలించటానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి, భద్రత, ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఆర్థిక, సామాజిక పునరుద్ధరణకు, అభివృద్ధిని వేగవంతం చేయడానికి.. ఈ నాలుగు దేశాలతో నవంబర్‌ 10న వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మౌలిక సదుపాయాల కోసం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్ట్‌ అభివృద్దే లక్ష్యంగా ఉన్నారని మరోసారి పేర్కొంది. కాగా, దక్షిణాసియా దేశాల్లో ఈ బీఆర్‌ఐ ప్రాజెక్ట్‌ను తిరస్కరించింది ఒక్క భారత్‌ మాత్రమే. తన సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందని భారత్‌ బీఆర్‌ఐలో చేరలేదు. చైనా మాత్రం బీఆర్‌ఐ ద్వారా మౌలిక సదుపాయాల ఏర్పాటు వల్ల వేగంగా అభివృద్ది సాధించగలమని, సరిహద్దుల వద్ద ఓడరేవులలో సరుకులను రవాణా చేయడానికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటనలో తెలిపింది. వైద్యంలో ఈ నాలుగు దేశాలకు సహకారాన్ని ఇవ్వటానికి బీజింగ్‌ సిద్దంగా ఉందని, వైద్య పరికరాలను అందించనున్నట్లు పేర్కొంది. కోవిడ్‌-19 సమాచారం మార్పిడికి, సహకారానికి ఈ దేశాలు సుముఖత చూపుతున్నాయని తెలిపింది.   (చైనాతో ఉద్రిక్తతలకు చెక్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement