అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’ | Chinese agro terrorism against America | Sakshi
Sakshi News home page

అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’

Jun 5 2025 1:46 AM | Updated on Jun 5 2025 1:46 AM

Chinese agro terrorism against America

మిచిగాన్‌ యూనివర్సిటీలో ఇద్దరు చైనీయుల అరెస్ట్‌ 

ధాన్యం దిగుబడిని చావుదెబ్బ తీసే శిలీంధ్రం అక్రమ రవాణా 

మిచిగాన్‌ యూనివర్సిటీలోపరిశోధనల కోసమేనన్ననిందితురాలు 

ఇది జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు:ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ 

ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం అరెస్ట్‌ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. 

అదే దురుద్దేశంతో ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్‌’అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యుంకింగ్‌ జియాన్, ఆమె సన్నిహితుడు జున్‌యాంగ్‌ లియులను అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేసి, విచారణ జరుపుతున్నారు. 

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా.. చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశమైంది. 

చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే 
యుంకింగ్‌ జియాన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని కాష్‌ పటేల్‌ తెలిపారు. ‘సహ నిందితుడైన ఆమె సన్నిహితుడు జున్‌యాంగ్‌ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైనే పరిశోధనలు చేస్తుండేవాడు. 

ఈ శిలీంధ్రంపై మిచిగాన్‌ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్‌ మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా గత ఏడాది అక్రమంగా రవాణా చేసినట్లు లియు తొలుత బుకాయించినా, తర్వాత తప్పు అంగీకరించారని తెలిపారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్‌మెంట్లు,వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశా’మని కాష్‌ పటేల్‌తెలిపారు. 

అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెనుప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్భిద్ధితోనే పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకొని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం అని కాష్‌ పటేల్‌ అన్నారు. 

ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్‌బిఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్‌ ఎఫ్‌బిఐ బృందం, కస్టమ్స్‌–సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. 

ఆగ్రో టెర్రరిజం మూలాలు.. 
మధ్య ప్రాచ్యానికి చెందిన అస్సిరియన్‌ అనే జాతి వారు క్రీ.పూ. 660లోనే వ్యవసాయసంబంధమైన ఉగ్రవాదచర్యకు తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్‌ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు. ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్, ఆంథ్రాక్స్‌ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. 

యూరప్‌లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్‌లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్‌లోని బంగాళా దుంపల పొలాలను ‘కొలరాడో పొటాటో బీటిల్స్‌’సాయంతో నాశనం బ్రిటన్‌ చేయాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది.  

ప్రమాదకరమైన ఫంగస్‌
‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్‌ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు’వంటిదని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘యుంకింగ్‌ జియాన్‌ అనే యువతి మిచిగాన్‌ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూసేరియం గ్రామినిరమ్‌ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు భావిస్తున్నాం.

గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో ‘కంకి ఎండు తెగులు’ను కలిగించటం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం.. పంటలను దెబ్బతీయటంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు’అని ఆయన పేర్కొన్నారు. 

పాక్‌ ద్వారా మన దేశంలోకీ.. 
చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల ద్వారా భారత్‌కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) పత్రాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో కనిపించిన ఒక ప్రమాదకర ఫంగస్‌ 2016లో పశ్చిమ బెంగాల్‌లోని 2 జిల్లాల్లోకి ప్రవేశించింది. గోధుమ పంటను నాశనం చేసే ఆ ఫంగస్‌ను ప్రభుత్వం సమర్థంగా నాశనం చేసింది. 

మూడేళ్ల పాటు గోధుమ పంట వేయకుండా ఆదేశాలు జారీచేసి, ఆ ఫంగస్‌ విస్తరించకుండా చేయగలిగింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్‌ పాకిస్థాన్‌ నుంచి దక్షిణ పంజాబ్‌ ప్రాంతంలోకి ప్రవేశించింది. దాదాపు మూడింట రెండొంతుల పత్తి పంట నాశనమైపోయింది. సుమారు 670 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక సుమారు 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

- సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement