పర్యావరణ  విలాపం | Environmental Impact of the Conflict in the world countries | Sakshi
Sakshi News home page

పర్యావరణ  విలాపం

Jun 5 2025 5:03 AM | Updated on Jun 5 2025 5:33 AM

Environmental Impact of the Conflict in the world countries

యుద్ధాలతో మరింత సంక్లిష్టంగా మారుతున్న వాతావరణ సంక్షోభం

ఇజ్రాయెల్‌ మొదలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాల దాకా అన్నీ పర్యావరణ విధ్వంసకాలే

విశ్వవ్యాప్తంగా సాయుధ కార్యకలాపాలతో పెరిగిన కర్బన ఉద్గారాలు

40 శాతం కొత్త ఘర్షణలతో వివాదాల సుడిగుండంలోకి సహజవనరులు

యుద్ధం కొనసాగినన్ని రోజులూ రణ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్తతర్పణమే. సైనికుల రుధిరంతో తడిసి ముద్దయిన భూములు మాత్రమే కాదు పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగుభూమి, జనావాస ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ), 2024 నివేదిక స్పష్టంచేసింది. 

హౌతీల తిరుగుబాటు, హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, ఘర్షణలు చివరకు పర్యావరణ సంక్షోభాగ్నుల్ని మరింత ఎగసిపడేలా చేస్తున్నాయని యూఎన్‌ఈపీ నివేదిక వెల్లడించింది. సరిహద్దు వివాదాలు మొదలు అంతర్జాతీయ విధానాలదాకా పొరుగు దేశాలు, శత్రుదేశాల మధ్య వైరం తుదకు పర్యావరణాన్ని మరింతగా నాశనంచేస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది.

 దశాబ్దాల క్రితమే జీవాయుధాలు ప్రయోగించి కిలోమీటర్ల కొద్దీ జనావాసాలను విషవాయువులతో గరళమయం చేసిన దేశాల దుష్టాంతాలనూ నివేదిక గుర్తుచేసింది. యుద్దాల వేళ శత్రు దేశాల జలాశయాలను, ఆనకట్టలపై బాంబులేసి నేలమట్టంచేయడంతో వందల కోట్ల లీటర్ల తాగు,సాగునీరు దిగువ ప్రాంతాలను ముంచేసి లక్షల ఎకరాల సాగుభూములు నీటమునుగుతున్నాయి. ఆనకట్టల నీరు సమీప ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని స్తంభింపజేస్తోంది. ఆయా నదీ ప్రవాహాల వెంట జీవవైవిధ్యం సైతం ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలు, పీఠభూములు సైతం నామరూపాల్లేకుండా నాశనమవుతున్నాయి. ఇలా ఆయా దేశాల్లో పర్యావరణం పతనమవుతోంది. 

జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టు
1990 దశకం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు మరెన్నో రకాలుగా పర్యావరణ విధ్వంసానికి  ప్రధాన కారణమయ్యాయి. 1990 దశకంలో యుద్ధంలో భాగంగా కువైట్‌లోని 700కుపైగా చమురు బావులకు ఇరాక్‌ సేనలు నిప్పు పెట్టాయి. దీంతో రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు అగ్నికి ఆహుతై నల్లటి మేఘాలు యావత్‌ ప్రాంతంలో కమ్మేశాయి. దీంతో అంతులేని పర్యావరణ విధ్వంసం జరిగింది. చమురుబావులు ఏకధాటిగా ఏడు నెలలపాటు తగలబడి చరిత్రలో ఎన్నడూ లేనంతటి పొగను సహజావరణలోకి వెదజల్లాయి. సమీప సముద్ర ఉపరితలజలాలు సైతం విస్తృతంగా పరుచుకున్న చమురు తెట్టతో పాడైపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింది. కువైట్‌ లోని 99 శాతం మంచినీటి సరస్సులు కాలుష్యకాసారాలుగా మిగిలిపోయాయి. వాయుకాలుష్యానికితోడు ఆ రీజియన్‌లో మెజారిటీ ప్రజలకు శ్వాససంబంధ వ్యాధులు ప్రబలాయి. ఈ ఘటనతో ప్రపంచం ఆర్థికగాయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆతర్వాతి నుంచే ముడి చమురు ధరలు వడివడిగా పెరగడం మొదలైంది.

ఆనకట్టల పేల్చివేతతో అంతులేని విధ్వంసం
ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొస్తున్న రష్యా వైమానిక దళాలు 2023లో కఖోవ్కా ఆనకట్టను రాత్రికిరాత్రే పేల్చేశారు. దీంతో డ్యామ్‌లోని అపార జలరాశి దిగువ ప్రాంతాల్లోకి వృథాగా పోయింది. దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో పంటభూములు పూర్తిగా నాశనమయ్యాయి. గనులు, చమురు బావులు, పారిశ్రామిక వ్యర్థాలు మొత్తం డినిప్రో నది, నల్లసముద్ర పరీవాహక ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చి పర్యావరణ విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఇలా ఒక్క కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేతతో దాదాపు వేయికిపైగా ప్రాంతాల్లో పర్యావరణం కోలుకోనంతగా పాడైపోయిందని నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యం ధ్వంసమవడంతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

తాజాగా గాజాలో..
గాజాలో ఇజ్రాయెల్‌ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. భవ నాలు, రోడ్లను పేల్చేయడంతో గాజా అంతటా ఎక్కడ చూసినా కాంక్రీట్‌ శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. 2023–24 కాలంలో గాజాలో దాదాపు 4 కోట్ల టన్నుల చెత్త పెరిగింది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 107 కేజీల చెత్త అదనంగా వచ్చి చేరింది. గాజాలో పచ్చదనం దాదాపు పూర్తిగా కనుమరుగైంది. గాజా సమీప ప్రాంతాల్లో 80% చెట్లు కూలిపోయాయి. మూడింట రెండొంతుల సాగుభూమి బాంబులు, ఫిరంగి గుళ్లు, క్షిపణి శకలాలతో నిండిపోయి సాగుకు పనికిరాకుండా పోయాయి. తూర్పు మధ్య« దరా ప్రాంతంలో భూమాత  ఊపిరితిత్తులుగా ఖ్యాతిగాంచిన ‘వాడీ గాజా’ చిత్తడి నేలలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడి 150 రకాల సకశేరుక జీవులు, 70 రకాల ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

దళాలు.. పర్యావరణ దోషులు
రోజూ ప్రపంచవ్యాప్తంగా వందల పౌరవిమానాలు కోట్ల లీటర్ల ఇంథనాన్ని మార్గమధ్యంలో ఆకాశంలో మండిస్తూ పొగను వెదజల్లుతూ పర్యావరణానికి చేటుచేస్తున్నాయి. సముద్రమార్గాల్లో ప్రయాణిస్తూ సరుకు రవాణా నౌకలు సైతం ఇదే పనిచేస్తున్నాయి. వీటిని మించి యుద్ధా్దల ద్వారా దేశాల సాయుధబలగాలు అత్యధికస్థాయిలో కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ల విడుదలలో యుద్ధాల్లో పాల్గొన్న దేశాల మిలటరీల వాటా 5.5 శాతానికి పెరిగింది. 

ఇందులో ఒక్క అమెరికా వాటానే ఒక శాతం ఉండటం గమనార్హం. యుద్ధ ట్యాంక్‌లు, శతఘ్నులు, జెట్‌ విమానాలు, సైనిక రవాణా వాహనాలు కోట్ల లీటర్ల ఇంధనాన్ని తాగేస్తూ పొగ, అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. గాజాలో పేలుళ్లతో పేరుకుపోయిన 1.5 కోట్ల టన్నుల కాంక్రీట్‌ శిథిలాలు సైతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించనున్నాయి. సహజ వనరులు నాశనం కావడానికి కొత్తగా పొడచూపుతున్న యుద్ధాలు 40 శాతం కారణమని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పర్యావరణ విధ్వంసాలకు ఆయా దేశాలను బాధ్యులను చేస్తూ నష్టపరిహార, సహాయక చర్యలు తీసుకోవాలని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..

→ విస్తృతస్థాయిలో, ఎక్కువ మంది పౌరులను ప్రభావితంచేసే ఘర్షణలను ఇకపై అంతర్జాతీయ నేరంగా పరిగణించాలి
→ ఐరాస వాతావరణ మార్పుల ముసా యిదా సమావేశం(యూఎన్‌ఎఫ్‌సీసీసీ) నిబంధనలను అనుసరిస్తూ ఇకపై ప్రతిదేశం తమ సైన్యం ఏ స్థాయిలో కర్బన ఉద్గారాలను వెదజల్లిందో ఆ డేటాను నిష్పాక్షికంగా బహిర్గతం చేయాలి
→ అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతిపాదించినట్లుగా ఘర్షణలు సద్దుమణిగాక యుద్ధంతో దెబ్బతిన్న పర్యావరణానికి పునరుజ్జీవం కల్పించేందుకు 20 శాతం నిధులను కేటాయించాలి
→ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్‌ చేసిన ‘‘ ఒకే భూమి, ఒకే కుటుంబం’ ప్రేరణగా సమీకృత వాతావరణ దౌత్య వేదికనూ నెలకొల్పాలి. సరిహద్దుల వెంట నిరాయుధీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి
→ 2024లో అన్ని దేశాల సైనిక బడ్జెట్లు 2.4 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగినట్లే.. జీవవైవిధ్య పరిరక్షణా నిధులనూ దేశాలు పెంచాలి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement