
ఆకాశాన్ని అంటుతున్న పర్యావరణ ఉద్యమ భవనాన్ని చూస్తూ....గొప్పగా మాట్లాడుకుంటాం. ఆ అమూల్యమైన భవనం రాత్రికి రాత్రి వెలిసింది కాదు. రాత్రనకా, పగలనకా ఎంతోమంది కష్టపడితే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఆ భవనానికి పునాదిరాళ్లు వేశారు. వారి అడుగుజాడలు ఆదర్శప్రాయం, అనుసరణీయం...
పక్షులను రక్షించుకుందాం
రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసింది రేచెల్ కార్సన్. ఆధునిక పర్యావరణవాదానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా గుర్తింపు పొందిన రేచెల్ 1962లోనే ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని రాసింది. రసాయన ఎరువుల వాడకం వల్ల పక్షులకు జరుగుతున్న ప్రాణ నష్టం గురించి ఈ పుస్తకంలో వివరించింది.
పర్యావరణ పార్టీ
మారినా సిల్వా తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేసేది. పదహారేళ్ల వయసు వరకు చదవడం, రాయడం రాదు. ఆ తరువాత కష్టపడి చదువుకుంది. డిగ్రీ సాధించింది. చిన్న వయసులోనే సెనెటర్ అయ్యింది. బ్రెజిల్ పర్యావరణశాఖ మంత్రిగా స్ఫూర్తిదాయకమైన పనులకు శ్రీకారం చుట్టింది. అటవీ నిర్మూలన జరగకుండా చేసింది. ఎన్నికలలో ‘పర్యావరణం’ అనేది కీలక అంశం అయ్యేట్లు చేసింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సస్టెయినబిలిటీ నెట్వర్క్’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించింది.
నిర్లిప్తత వదిలేలా...
‘వియ్ యాక్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జస్టీస్’ వ్యవస్థాపకురాలు పెగ్గీ షెప్పర్డ్. 1988 నుంచి మన్హట్టన్లో పర్యావరణ సంరక్షణకు సంబంధించి కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. అమెరికాలో ఎన్నో ప్రాంతాలు కాలుష్యానికి చిరునామాలుగా ఉండేవి. అయినప్పటికీ ‘మనం ఏం చేయలేము’ అనే నిర్లిప్తత జనాలలో ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి పర్యావరణ స్పృహ తీసుకు రావడానికి కృషి చేసింది షెప్పర్డ్. ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అడ్వైజరీ కౌన్సిల్’కు తొలి మహిళా చైర్పర్సన్గా గుర్తింపు పొందింది.
తిరుగులేని యోధురాలు
‘భయం లేని యోధురాలు’గా గుర్తింపు పొందిన మార్జరీ స్టోన్మన్ డగ్లస్ జర్నలిస్ట్, రచయిత్రి. స్త్రీవాదం, పర్యావరణవాదం కోసం తన శక్తిమంతమైన గొంతును వినిపించేది. 1947లో ‘ది ఎవర్గ్లైడ్స్: రివర్ ఆఫ్ గ్రాస్’ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది. పర్యావరణ సంరక్షణకు ప్రజా మద్దతు కూడగట్టడంలో క్రియాశీల పాత్ర పోషించింది.
అడవి తల్లి కోసం...
ఎమ్మీ అవార్డ్–విన్నింగ్ జర్నలిస్ట్ వెనేస హాక్ పదిహేను సంవత్సరాలకు పైగా పర్యావరణ సమస్యలను వెలుగులో తీసుకువచ్చింది. కేవలం రాతలకే పరిమితం కాకుండా ప్రజలలో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఉద్యమ స్థాయిలో పనిచేసింది. పర్యావరరణ సమస్యలపై ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ‘మదర్ జంగిల్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పనిచేసింది.
ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చేలా...
‘గ్రీన్బెల్ట్ మూమెంట్’ వ్యవస్థాపకురాలైన వంగరి మాథాయ్ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమకారులలో ఒకరు. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ఆఫ్రికన్ మహిళ. మొక్కలు నాటే పనిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఎంతోమంది మహిళకు ఉపాధి లభించింది. మాథాయ్ చేసిన పర్యావరణ ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు స్ఫూర్తిని ఇచ్చాయి.
(చదవండి: