
పాక్లో టీనేజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో టీనేజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసఫ్(17) హత్యకు గురైంది. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఇస్లామాబాద్లో సుంబల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈమె తండ్రి ప్రభుత్వ అధికారి కాగా, తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. మంగళవారం నివాసంలో ఉండగా ఈమె వద్దకు ఉమర్ హయత్ అలియాస్ కాకా వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడాక తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో ఆమెపైకి రెండుసార్లు కాల్పులు జరిపి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో సనా బంధువు ఒక్కరే ఇంట్లో ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. హయత్ కూడా టిక్టాకరేనని తెలిపారు. ఇతడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పాకిస్తాన్లో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్ సనా. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు.
