
రెండు, మూడేళ్లుగా మంతనాలు జరుపుతున్నామన్న సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది పన్నూ
ఒట్టావా: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఏకంగా అధికారవర్గంతోనూ అంటకాగాయన్న వాదనలు నిజమని నిర్ధారణ అయింది. జస్టిన్ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నామని భారత్లో నిషేధిత ఉగ్రసంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ప్రకటించారు. కెనడా ప్రధాని కార్యాలయంతో గత రెండు, మూడేళ్లుగా ఉత్తరప్రత్యుత్తరాల తంతు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
సీబీసీ న్యూస్ ముఖాముఖిలో ట్రూడోను పన్నూ పొగిడారు. ‘‘మీడియా సమావేశంలో ట్రూడో చేసిన ప్రకటనతో జాతి భద్రతకు, న్యాయం, చట్టం అమలుకు కెనడా ప్రభుత్వం ఎంతగా కట్టుబడిందో చాటిచెబుతోంది. పీఎం కార్యాలయంతో గత మూడేళ్లుగా సంప్రతింపులు జరుపుతున్నాం. కెనడాలో భారతీయ ఏజెంట్ల నిఘా నెట్వర్క్ గుట్టుమట్లను ప్రభుత్వానికి అందజేశాం. హర్దీప్ సింగ్ పన్నూ హత్యకు కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ వర్మ, అతని సిబ్బంది ఎలా కుట్ర పన్నారో, ఎలా అమలుచేశారో పీఎంఓకు తెలియజేశాం’’అని అన్నారు.
కెనడాలో భారతీయ ఏజెంట్లు హింసను ఉసిగొల్పుతున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చేసిన ఆరోపణలనే పన్నూ వల్లెవేయడం గమనార్హం. భారతీయ–కెనడియన్ పౌరులు కెనడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేరని పన్నూ ఆరోపించారు. భారతీయ కెనడియన్లను దేశం విడిచిపోవాలని పన్నూ గతంలో హెచ్చరించారు. ‘‘కెనడా రాజ్యాంగాన్ని పాటించని మీరు కెనడాలో ఉండకూడదు. కెనడాను వదిలేసి భారత్కు వెళ్లిపొండి’అని గత ఏడాది ఇండో కెనడియన్ హిందువులను పన్నూ హెచ్చరించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment