కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్‌! | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్‌!

Published Sat, Nov 4 2023 1:40 AM | Last Updated on Sat, Nov 4 2023 8:22 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సీపీ అభిషేక్‌ మహంతి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో 16 కేసులు నమోదవడం, అందులో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడినా, మందు, విందులు ఏర్పాటు చేసినా, సమయం దాటి ప్రచా రం కొనసాగించినా, డీజే వాహనాలు వాడినా, ఆఖ రుకు ఎమ్మెల్యే అభ్యర్థి పోస్టర్లు వాహనాలకు వేసుకున్నా కేసులు పెడుతూ.. ఆ వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. కొన్ని పార్టీల వారు ప్రచారంలో భాగంగా ఆటోలు, కార్లపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఆ వాహనాలను సీజ్‌ చేయడంతో తాము జీవనోపాధి కో ల్పోతున్నామని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు.

► కేశవపట్నం మండలంలోని ఎరడపల్లికి చెందిన మాతంగి హరికృష్ణ, కలకుంట్ల రంజిత్‌రావు, పోతునూరి హరీశ్‌, వి.సాయికృష్ణ గత మంగళవారం డీజేతో మానకొండూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయికి ప్రచారం చేసినందుకు సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు.
► చొప్పదండిలో బీఆర్‌ఎస్‌కు చెందిన మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్‌, మహేశ్‌, ఎన్నం మనోహర్‌, శ్రీకాంత్‌ అనుమతి లేకుండా స్థానిక ఫంక్షన్‌హాల్లో దాదాపు 100 మందికి భోజనం, మద్యం సరఫరా చేయగా.. కేసు నమోదైంది.
► కరీంనగర్‌ గీతాభవన్‌ చౌరస్తాలో ఎం.హరీశ్‌ కారులో అనుమతి లేకుండా తరలిస్తున్న బీజేపీకి సంబంధించిన 500 కరపత్రాలు, 10 పార్టీ కండువాలు గుర్తించి, కేసు నమోదు చేశారు.

► హుజూరాబాద్‌లో మంగళవారం టీడీపీకి చెంది న ఐత హరీశ్‌, రామగిరి అంకూస్‌, ఆడెపు రవీందర్‌, లింగారావు, ఫయాజ్‌ అనుమతి లేకుండా అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద టపాసులు పేల్చినందుకు కేసు నమోదైంది.
► కమాన్‌ చౌరస్తా వద్ద తనిఖీల్లో శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన నందికొండ మహేందర్‌రెడ్డి కారుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి పోస్టర్‌ను ప్రదర్శించినందుకు కేసు నమోదైంది.
► తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంకు చెందిన వరికోళ్లు చంద్రయ్య తన ఆటోపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి పోస్టర్‌ ప్రదర్శించినందుకు వాహనాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు.
► గంగాధరకు చెందిన పులి మారుతి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం బుధవారం అనుమతి లేకుండా వంద మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రామడుగులోని ముదిరాజ్‌ సంఘం భవనం వరకు డీజే వినియోగంపై కేసు నమోదైంది.
► గంగాధరకు చెందిన లోక రాజేశ్వర్‌, రామిడి సురేందర్‌, సుంకె రవిశంకర్‌, బీఆర్‌ఎస్‌ తాడిచెరువు గ్రామ శాఖ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. బుధవారం బీఆర్‌ఎస్‌ చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్‌ సమయం దాటినా ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.

► మానకొండూరులో నిర్వహించిన తనిఖీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మండపల్లికి చెందిన జగ్గాని శివ, చొప్పదండి శ్రీనివాస్‌ కారులో సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌కి సంబంధించిన 180 కరపత్రాలు, 50 బుక్‌లెట్‌లను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు.
► జమ్మికుంట పరిధి జగ్గయ్యపల్లెలో బుధవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనంలో డీజే వినియోగంపై అబ్దుల్‌ కరీమ్‌, బడే జేమ్స్‌, వడ్డేపల్లి సతీశ్‌, వడ్డెపల్లి పోచయ్యలపై కేసు నమోదైంది.
► కరీంనగర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద చేపట్టిన తనిఖీ ల్లో తిమ్మాపూర్‌ మండలంలోని అలుగునూర్‌కి చెందిన జమీల్‌ఖాన్‌ తన ఆటోపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి పోస్టర్‌ను అంటించినందుకు వాహనాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు.
► కశ్మీర్‌గడ్డలో బీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ మహబూబ్‌ ఖాన్‌ మైనారిటీ యూత్‌ ఆత్మీ య సమావేశంలో 500మందికి చికెన్‌ బిర్యానీతో విందు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదైంది.
► చొప్పదండిలో గురువారం బీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ లోక రాజేశ్వర్‌ రెడ్డి,బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 300 మందితో సమావేశం నిర్వహించారు. ఇక్కడ డ్రోన్‌ వినియోగంపై రాజేశ్వర్‌ రెడ్డి, రవిశంకర్‌, రాజులపై కేసు నమోదు చేశారు.
► ఇంటింటి ప్రచారానికి బదులుగా గర్శకుర్తిలో పబ్లిక్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసినందుకు పులి మారుతి, చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం, గ్రామ శాఖ అధ్యక్షుడు చిప్ప చక్రపాణిలపై కేసు నమోదైంది.
► కనపర్తి సర్పంచ్‌ పర్లపల్లి రమేశ్‌, వల్బపూర్‌ సర్పంచ్‌ ఎక్కటి రఘుపాల్‌ రెడ్డి, మొలుగు పూర్ణచందర్‌ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ స్తంభాలకు జెండాలు కట్టడం, టపాసులు పేల్చడంపై గురువారం కేసు నమోదు చేశారు.
► హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వొడితెల ప్రణవ్‌, పార్టీ వీణవంక మండల అధ్యక్షుడు శ్యాంసుందర్‌ రెడ్డి వీణవంకలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 300 మందితో సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement