ఉల్లంఘనులు | - | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులు

Published Wed, Mar 5 2025 12:23 AM | Last Updated on Wed, Mar 5 2025 12:22 AM

ఉల్లంఘనులు

ఉల్లంఘనులు

జిల్లాలో ఖనిజాల లీజ్‌ల వివరాలు

ఖనిజం లీజ్‌ల భూమి విస్తీర్ణం

సంఖ్య (హెక్టార్లలో)

బ్లాక్‌ గ్రానైట్‌ 141 293.474

స్టోన్‌, మెటల్‌ 51 103.08

డోలమైట్‌ 03 31.507

గ్రావెల్‌ 03 6.830

బైరటీస్‌ 02 7.972

క్వార్ట్‌ ్జ 01 5.837

కోరండమ్‌ 01 2.00

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘జిల్లాలో మైనింగ్‌ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. లీజ్‌దారులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. లీజ్‌కు మించి ఎక్కువ తవ్వకాలు చేపడుతూ లెక్కల్లో తక్కువగా నమోదు చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో 450.07 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా భూముల్లో 202మంది వ్యక్తులు, సంస్థల మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. అనుమతులకు మించి అక్రమంగా, ఇష్టారీతిన తవ్వి తరలిస్తున్నారు’ అని ఇటీవల ఖమ్మంకు చెందిన ఎన్‌.రాము హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, జిల్లాలోని పలు చోట్ల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా మైనింగ్‌ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

450.07 హెక్టార్లలో లీజు

జిల్లాలో 450.07 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా భూముల్లో ఖనిజాల తవ్వకానికి 202 మంది వ్యక్తులు, సంస్థలకు అనుమతులు ఉన్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో స్టోన్‌, మెటల్‌, గ్రావెల్‌, బ్లాక్‌ గ్రానైట్‌, కలర్‌ గ్రానైట్‌, బైరటీస్‌, డోలమైట్‌, క్వార్ట్‌జ్‌, కోరండమ్‌ తదితర ఖనిజాల మైనింగ్‌ జరుగుతోంది. ప్రధానంగా స్టోన్‌, మెటల్‌ 51 లీజ్‌లు, బ్లాక్‌ గ్రానైట్‌కు సంబంధించి 141 లీజ్‌లు ఉన్నాయి. అయితే, అనుమతి ఆధారంగా నిర్ణీత విస్తీర్ణంలోనే ఖనిజాలను వెలికితీయాల్సి ఉండగా పలువురు లీజ్‌దారులు నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణీత స్థలానికి చుట్టుపక్కల సైతం తవ్వకాలు చేపట్టడం, ప్రభుత్వానికి మాత్రం తక్కువ లెక్కలు చూపిస్తుండగా ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇక పర్యావరణం విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

మైనింగ్‌ కార్యకలాపాలను గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకులు, పర్యావరణ అనుమతులను కొత్తగూడెం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారులు పర్యవేక్షించాలి. అయితే వీరు విధుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్‌లో ప్రస్తావించారు. కొందరు గనులు, భూగర్భశాఖ అధికారులు.. తమ బంధువులు, మిత్రుల పేరుతో అనుమతులు తీసుకుని అక్రమ మైనింగ్‌లో భాగస్వాములుగా మారుతున్నట్లు పిల్‌లో పేర్కొన్నాడు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తమ శాఖ ఉద్యోగులే కావడంతో బుట్టదాఖలు చేస్తున్నారని సదరు వ్యక్తి హైకోర్టుకు వివరించాడు.

మైనింగ్‌లో నిర్వాహకుల ఇష్టారాజ్యం

ఎక్కువ విస్తీర్ణంలో తవ్వుతూ

తక్కువగా నమోదు

ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి

హైకోర్టులో పిల్‌ దాఖలుతో

అధికారులకు నోటీసులు

సమాధానం ఇవ్వండి..

జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ఖమ్మంకు చెందిన ఎన్‌.రాము గత ఏడాది అక్టోబర్‌లో హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని కోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. అక్రమ మైనింగ్‌తోపాటు స్టోన్‌క్రషర్ల అక్రమ నిర్వహణ, పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందని లేఖలో పేర్కొనగా సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పీసీసీఎఫ్‌, కలెక్టర్‌, సీపీ, సంబంధిత శాఖ అధికారులు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

అన్నీ సక్రమంగానే ఉన్నాయి..

జిల్లాలో అన్ని క్వారీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే

అనుమతులు ఇస్తున్నాం. అనుమతుల ఆధారంగా తవ్వకాలు కొనసాగుతున్నాయే తప్ప ఎక్కడా

ఉల్లంఘనలు జరగలేదు. కోర్టు ఆదేశాలను

గౌరవిస్తూ కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేస్తాం.

– సాయినాథ్‌, ఏడీ, మైనింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement