అడవిలో అన్నలు లేనట్లేనా! | - | Sakshi
Sakshi News home page

అడవిలో అన్నలు లేనట్లేనా!

Published Thu, Oct 10 2024 12:40 AM | Last Updated on Thu, Oct 10 2024 11:40 AM

-

 ‘ఎల్‌డబ్ల్యూఈ’ నుంచి మూడు జిల్లాల తొలగింపు 

 కొనసాగించాలంటూ రాష్ట్ర సర్కారు వినతి 

 ప్రత్యేక నిధులు, పథకాల అమలు లేనట్లే.. 

 అడవుల జిల్లాలో ‘మావో’లది మరువలేని చరిత్ర

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వామపక్ష తీవ్రవాద ప్రాంతాల జాబితా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను కేంద్ర హోంశాఖ తొలగించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ మావోయిస్టుల కార్యక్రమాలేవి లేకపోవడం, భద్రత బలగాలు పూర్తి పట్టు సాధించడంతో ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌స్ట్రిమిజం ఎఫెక్టెడ్‌) ప్రాంతాల నుంచి తప్పించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రత్యేక పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రత బలగాల పర్యవేక్షణ కొనసాగతున్నాయి. భవిష్యత్‌లో ఈ కార్యకలాపాలు క్రమంగా తగ్గనున్నాయి.

ప్రత్యేక పథకాలతో నిధులు
దేశంలో నక్సలిజాన్ని తగ్గించేందుకు ఆపరేషన్‌ ‘సమాధాన్‌’, రాష్ట్రంలో ‘గ్రీన్‌హంట్‌’ పేర్లతో మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. 2010లో 96జిల్లాల్లో ‘మావో’ల ప్రభావం ఉండగా, 2021నాటికి 46కు పడిపోయి, తాజాగా 38జిల్లాలకు చేరింది. ఈ నెల 7న వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాలను వా మపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ఎల్‌డబ్ల్యూఈ నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నక్సల్స్‌ కారణంగా ఎన్నికల సమయంలో ఓటింగ్‌ గంట ముందే నిలిపివేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర, కేంద్ర బలగాల పహారా, స్థానికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశంలో 2026నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది.

సమసమాజ స్థాపన లక్ష్యంగా
పేద, ధనిక మధ్య అంతరాలను తొలగిస్తూ భూ స్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐదు దశాబ్దాల క్రితం నక్సలిజం పురుడు పోసుకుంది. కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల పరిష్కారానికి విప్లవ పంథాలోనే సమసమాజ స్థాపన సాధ్యమని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా నుంచి యువత నక్సలిజం వైపు మళ్లారు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ గిరిజన, మైదాన ప్రాంతాలు, ఇటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సంస్థలు విప్లవ బావుటా ఎగురవేశాయి. ప్రజల మద్దతుతో అనేక పోరాటాల్లో పోలీ సులపై పైచేయి సాధించారు. లక్సెట్టిపేట, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఖానాపూర్‌, తిర్యాణి, సిర్పూర్‌, చెన్నూరు, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్‌, జ న్నారం తదితరచోట్ల భీకర పోరాటాలు జరిగాయి. దొరల ఇళ్లపై దాడులు, దోపిడీదారులు, ప్రజాకంఠకులను ప్రజాకోర్టులో శిక్షించేవారు. ఆ సమయంలోనే నిరుపేదలకు భూపంపిణీ జరిగింది. బలగాలు, నక్సల్స్‌కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉండగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.

‘కడంబా’ ఘటన చివరిది
ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి తీర గ్రామాలకు గత పదేళ్లుగా కొత్త రోడ్లు, సమాచార వ్యవస్థతో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రులు, గిరిజన యువతకు పథకాలు తె చ్చారు. దీంతో నక్సలిజం తగ్గింది. తెలంగా ణ ఏర్పడ్డాక కేబీఎం(కుమురంభీం మంచి ర్యాల) కమిటీ తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించింది. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించి దళంలో చే ర్చుకునే ప్రయత్నం చేసింది. 2020లో కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో భద త్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు మృతిచెందారు. 

మావోయిస్టు పార్టీ రాష్ట్ర సభ్యుడు అడెళ్లు భాస్కర్‌ పట్టు పెంచే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. రెండేళ్ల క్రితం ఆయన సహచరి కంతి లింగవ్వ చనిపోయింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్‌, మంగీ, చెన్నూరు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీలు దండకారణ్యం కేంద్రంగానే కార్యకలా పాలు సాగించాయి. కోవిడ్‌ తర్వాత పలు మార్లు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రవేశించే ప్రయత్నాలు జరిగాయి. కానీ నిలదొక్కులేకపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్‌ కమిటీ పేరుతో సింగరేణి కార్మి కుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
● ‘ఎల్‌డబ్ల్యూఈ’ నుంచి మూడు జిల్లాల తొలగింపు ● కొనసాగిం1
1/1

● ‘ఎల్‌డబ్ల్యూఈ’ నుంచి మూడు జిల్లాల తొలగింపు ● కొనసాగిం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement