మహానంది: క్షేత్రం భక్తుల సందడి కొనసాగుతోం. సెలవు రోజులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. సాధారణ, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. అభిషేకం, మహదాశీర్వచనం ఆర్జిత సేవల ద్వారా భక్తులు వేచి ఉండి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శనం కొనసాగింది. సాధారణ, ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల పాటు సమయం పట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈఓ కాపు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఓలు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు కోదండరామాలయం, వినాయకనంది, గరుడనంది ఆలయాలను సందర్శించారు.
ఓంకారంలో భక్తుల సందడి
బండిఆత్మకూరు మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓంకారం ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ గంగ, ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించి పూజలు చేశారు. కాశిరెడ్డినాయన అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద అన్నప్రసాదాలు స్వీకరించారు.