
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం దారుణం
● నిందితులను కఠినంగా
శిక్షించాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్రెడ్డి
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ శిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరి ప్రతాప్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ నాయకులు యత్నించడం దారుణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. రామాలయంలో పూజలు చేస్తున్న వ్యక్తిని హత్య చేయాలనే ఆలోచనలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్సింగ్రాణాను కోరారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి.. ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవిందపల్లె గ్రామంలోని రామాలయంలో ఇందూరి ప్రతాప్రెడ్డి పూజలు చేస్తుండగా దుండగులు హత్యా యత్నానికి పాల్పడటం దారుణమన్నారు. పోలీస్ పికెట్ ఉన్న కొంత దూరంలోనే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు. కేసును నీరుగార్చేలా, కోర్టులో ప్రతాప్రెడ్డి సాక్షాలు చెప్పకుండా భయబ్రాంతులకు గురి చేసేలా హత్యాయత్నం చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు తరచూ దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. వీరిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఐదుగురిపై కేసు నమోదు
శిరివెళ్ల: వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, లక్ష్మీరెడ్డి, రమణారెడ్డి, మరో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అండగా ఉంటాం
గోస్పాడు: ఇందూరి ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన ఇందూరి ప్రతాపరెడ్డిని నంద్యాల పట్టణంలోని ఉదయానంద ఆసుపత్రిలో పరామర్శించారు.