
ఎర్ర బంగారమే!
ఎటు చూసినా..
వరంగల్: ఏనుమాములకు ఎర్ర బంగారం పోటెత్తింది. సీజన్ ఊపందుకోవడంతోపాటు వారాంతపు సెలవులు శని, ఆదివారం, ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ బుధవారం పునఃప్రారంభమైంది. దీంతో సుమారు 95వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఫలితంగా మార్కెట్లోని యార్డులతో పాటు బహిరంగ ప్రదేశాలు సైతం మిర్చి బస్తాలతో నిండిపోయాయి. కాగా, ఇంత పెద్ద మొత్తంలో మిర్చి రావడంతోనే ధరలను తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఒకే రోజు బస్తాలు రావడం.. ఎండలు పెరిగిపోవడంతో మార్కెట్లోని దడువాయిలు లాట్ ఐడీలు కొట్టడం, హమాలీ కార్మికులు కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతునా ్న రు. అన్ని రకాల మిర్చి రావడంతో ఘాటు పెరిగి కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్ల గొండ జిల్లాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మిర్చి తరలివస్తోంది.
ఎంట్రీలు లేక లెక్కల్లో తేడా..
గతంలో మార్కెట్లోకి వచ్చే ప్రతీ వాహనం, అందులోని బస్తాల వివరాలను గేటు వద్ద ఉన్న ఉద్యోగులు నమోదు చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గేటు వద్ద ఎంట్రీ చేసే విధానాన్ని ఎత్తివేశారు. దీంతో ఎన్ని బస్తాలు వస్తున్నాయో సిబ్బంది, అధికారులకే తెలియాలి. ఈ విధానం వల్ల వచ్చిన బస్తాల్లో ఎన్ని జీరో అవుతున్నాయో అంతుచిక్కడం లేదు. రోజూ కనీసం 5వేలకు పైగా బస్తాలు జీరో జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్వింటాకు రూ.5వేలు తక్కువ..
గతేడాది ధరలతో పోల్చుకుంటే ఈఏడాది తేజ, యూఎస్ 341, డీడీ, వండర్హాట్ తదితర రకాల మిర్చికి క్వింటాకు రూ.5వేలకు పైగా ధరలు తగ్గాయని రైతులు ఆరోపిస్తున్నారు. దిగుబడి తగ్గిందని బాధ పడుతుంటే ధరలు సైతం తగ్గడంతో పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ మార్కెట్కు పోటెత్తిన మిర్చి
లక్ష బస్తాల రాక..ఎరుపు రంగు పులుముకున్న ఏనుమాముల యార్డులు
సరుకు పెరిగింది.. ధర తగ్గింది
ఎంట్రీలు లేక బస్తాల లెక్కల్లో తేడా