
మన కలలను సాకారం చేసుకోవాలంటే.. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరించిన వాళ్లే. లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఎన్నో అవస్థలతో పాటు అవమానాలను ఎదుర్కొన్నవాళ్లే. అందుకు నటి దియా మీర్జా( Dia Mirza ) కూడా అతీతం కాదు. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన దియా.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. మోడల్గా రాణించేందుకు చాలా కష్టాలను భరించాల్సి వచ్చిందట. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా..చాలీ చాలని డబ్బులతోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘మోడలింగ్లోకి వెళ్తానని చెబితే ..ఫ్యామిలీ నుంచి అంతగా సపోర్ట్ అందలేదు. అయినా కూడా నా లక్ష్యం వైపే అడుగులు వేశాను. 2000లో నాతో పాటు ప్రియాంక చోప్రా(priyanka chopra), లారా దత్తా(Lara Dutta) మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం. ప్రియాంకకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేది. లారాకు, నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండేవాళ్లు కాదు. ముంబైలో లారా ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది. నేను ముంబై వెళ్లిన ప్రతిసారి ఆమె ఇంట్లోనే ఉండేదాన్ని. డబ్బులు ఉండేవి కాదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఖరీదైన దుస్తులు కొనేవాళ్లం కానీ..తినడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. ఆకలి తీర్చుకోవడం కోసం నూడుల్స్ తినేవాళ్లం. మా పరిస్థితి తలుచుకొని మేమే నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా..తినేది మాత్రం నూడుల్స్’ అని అనుకునేవాళ్లం’ అని దియా నాటి దీన కథను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది.

కాగా, 2000లో జరిగిన మిస్ ఇండియా పోటిల్లో లారా దత్తా విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్గా ప్రియాంక, సెకండ్ రన్నరప్గా దియా మీర్జా నిలిచారు. 2001లో ‘రెహ్నా హై తేరే దిల్ మే’మూవీతో దియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. ఇక 2021 లో విడుదలైన ‘ వైల్డ్ డాగ్’ అనే తెలుగు సినిమాలో కూడా ఈమె నటించారు. నటిగా, మోడల్గా, సమాజ సేవకురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమెకు 2012లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ ‘గ్రీన్ అవార్డు’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment