
సినిమాలకు హద్దులుండవు. అదేవిధంగా తారల పారితోషికాలకు పరిదులుండకుండా పోతున్నాయనే చెప్పాలి. ఒక పక్క కొత్త వారు అవకాశాల కోసం పాకులాడుతుంటే, మరో పక్క ప్రముఖ తారలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సక్సెస్ఫుల్ కథానాయికల పారితోషికం చూస్తుంటో అబ్బో అని అనకమానరు. దక్షిణాదిలో ఒకప్పటి వరకూ నటి నయనతారనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకిగా పేరుగాంచారు. ఈమె బాలీవుడ్ చిత్రం జవాన్ కోసం రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
కాగా నటి సాయిపల్లవి ఇప్పుడు ఆమెను అధిగమించేశారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఈమె నటించిన చిత్రాల్లో అధిక శాతం విజయాన్ని అందుకోవడమే ఇందుకు కారణం అని భావించవచ్చు. ఇటీవల తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సాయిపల్లవి నటించిన అమరన్ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో సాయిపల్లవి నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా నాగచెతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం హిట్ అయ్యింది. దీంతో మంచి అవకాశాలు సాయిపల్లవి వైపు చూస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సహజ నటి రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు.
నటుడు రణ్వీర్ కపూర్ రాముడిగానూ, యాష్ రావణుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. అంతే కాదు రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి కూడా. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో తొలిభాగంలో నటించడానికే నటి సాయిపల్లవి రూ.15 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటి నయనతార ఇప్పటి వరకూ రూ. 12 కోట్లు దాటలేదని, ఆ విధంగా చూస్తే నటి సాయిపల్లవి ఆమెను దాటేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పారితోషికం విషయంలో సాయిపల్లవి నటి నయనతారను అధిగమించారనే ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment