రాజమౌళి- మహేశ్‌ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున | Mahesh Babu And Nagarjuna Likely To Share Screen In Direction Of SS Rajamouli, Deets Inside - Sakshi
Sakshi News home page

రాజమౌళి- మహేశ్‌ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున

Published Fri, Feb 2 2024 5:51 AM

Mahesh Babu and Nagarjuna sharing screen - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు– కింగ్‌ నాగార్జున స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్‌ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న మహేశ్‌బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు కెరీర్‌లో 29వ మూవీగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు.

ఇటీవలే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్‌. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్‌లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్‌బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న.

Advertisement
Advertisement