
పహల్గామ్ ఉగ్రదాడిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాక్షసుల ఆకృత్యానికి ఎంతోమంది బలైపోయారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని తన బాధను వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.
ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ దాడిపై అంతకుముందే చిరు ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైందని.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పోస్ట్లో రాసుకొచ్చారు.