
సినిమా ఇప్పుడు ఒక్క భాష.. ఒక్క యాసకి పరిమితం కావడంలేదు. ‘΄పాన్ ఇండియా’ అయిపోయింది. అందుకే కథకు తగ్గ ‘యాస’ చుట్టూ సినిమా తిరుగుతోంది. ఇప్పుడు చిత్తూరు యాస సుట్టూ సినిమా తిరగతాంది! అన్ని సినిమాలూ కాదనుకోండి... అయితే ఇంతకుముందు వరకూ పెద్దగా వినపడని ఈ యాస ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో వినబడుతోంది. ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఎన్టీఆర్, ‘పుష్ప 1’ లో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు చిత్తూరు యాసలో మాట్లాడి, అలరించారు. ప్రస్తుతం చిత్తూరు యాస నేపథ్యంలో ‘పుష్ప 2’, ‘హరోం హర’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘అలిపిరికి అల్లంత దూరంలో’, ‘అమ్మాయిలు అర్థం కారు’ వంటి చిత్రాలు రూపొందుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
పులిపెక్కిపోతాండవంట..
‘ఏం ΄పాప.. నచ్చినానా నీకు’, ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’, ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’.. అంటూ ‘పుష్ప’ తొలి భాగంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఎంత ΄ాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హే ఛీ ఛీ.. నువ్వు నాకు నచ్చేదేంది.. నేను నిన్ను సూల్లేదని ఓ పులిపెక్కి పోతాండవంట గదా’ అంటూ రష్మికా మందన్న చెప్పిన మాటలు కుర్రాళ్ల హృదయాన్ని తాకాయి. చిత్తూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో విరివిగా ఉండే ఎర్రచందనం నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని
తెరకెక్కించారు. అల్లు అర్జున్, రష్మిక, సునీల్... ఇలా అన్ని ΄పాత్రలు చిత్తూరు యాసలోనే మాట్లాడతాయి. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ΄పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ‘పుష్ప 2’ రానుంది. తొలి భాగంలో నటించిన వారే రెండో భాగంలోనూ ఉంటారు.
నీ కోసం సూస్తా ఉండారు..
‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదో.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు ‘హరోం హర’ సినిమా మోషన్ టీజర్లో వినిపించాయి. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో ‘హరోం హర’ సినిమా రూ΄÷ందుతోంది. సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మాది తిరపతి.. నా పేరు విష్ణు
‘ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలీదన్నా.. మా జీవితాలన్నీ ఏడుకొండల సుట్టూ తిరగతా ఉంటాయి, మాది తిరపతి.. నా పేరు విష్ణు’ అంటూ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం టీజర్లో హీరో కిరణ్ అబ్బవరం చెప్పే చిత్తూరు యాస డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.
ఇవే కాదు.. మీడియమ్, స్మాల్ రేంజ్ చిత్రాల్లోనూ చిత్తూరు యాస వినపడనుంది. వాటిలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్ కీలక ΄ాత్రల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి శిష్యుడు ఆనంద్ జె. దర్శకత్వం వహించిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఒకటి. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. అలాగే నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోహీరోయిన్లుగా నటించారు. నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా కూడా చిత్తూరు యాస నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా చిత్తూరు యాస సుట్టూ తిరిగే కథలు కొన్ని ఉన్నాయి.
చదవండి: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్తో రెచ్చిపోయిన అడవి శేష్
Comments
Please login to add a commentAdd a comment