గృహ నిర్మాణాలకు అదనపు సాయం
● ఎస్సీలు, బీసీలకు రూ.50 వేల చొప్పున, ఎస్టీలకు రూ. 75 వేలు ● గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీవీటీజీలకు గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశల్లో ఉంటే వాటిని పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అనుమతిస్తూ జీఓఆర్టీ నంబర్ 9 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేల చొప్పున, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం పొందవచ్చన్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా ఈ అంశాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను, హౌసింగ్ ఏఈలకు సూచించారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,069 గృహాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 17,347 పొజిషన్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి తహసీల్దార్లతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలన్నారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ రూ.2.29 లక్షలకు అదనంగా మరో రూ.లక్ష సాయం అందుతుందన్నారు. పూర్తి చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తే చెల్లింపులు జరుగుతాయన్నారు. సమావేశంలో హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment