
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఆ గణాంకాల ఆధారంగా గడిచిన వారంలో కోవిడ్-19 కేసులు 1200 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా 3,758 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 363 కొత్త కేసులు నమోదు కాగా.. కోవిడ్-19తో నలుగురు మరణించారు.
ఈ మరణాల్లో ఒక్కోటి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండగా మిగతా రెండు పశ్చిమ బెంగాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ. ఈ రాష్ట్రంలో 1,400 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర (485), ఢిల్లీ (436), గుజరాత్ (320), పశ్చిమ బెంగాల్ (287) రాష్ట్రాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో (238), తమిళనాడులో (199), ఉత్తరప్రదేశ్లో (149), రాజస్థాన్లో (62) యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, గత మే 22న దేశంలో కేవలం 257 యాక్టివ్ కేసులుండగా మే 26న 1,010 కు పెరిగాయి. ఈ సంఖ్య మే 31నాటికి 3,395కు చేరింది. దీంతో దేశంలో కోవిడ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక హైలెట్ చేసింది. కొత్తగా నమోదైన 363 కేసుల్లో పశ్చిమ బెంగాల్లో 82, కేరళలో 64, ఢిల్లీలో 61, గుజరాత్లో 55 కేసులు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహల్ మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్-19 బాధితుల్లో ఒమిక్రాన్ సబ్వేరియంట్లు ఉన్నాయి. ఈ నాలుగు సబ్వేరియంట్లు LF.7, XFG, JN.1, NB.1.8.1. పశ్చిమ, దక్షిణ భారత్లో ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.