![Bihar AIMIM MLA Objects to Word Hindustan Instead to Use Bharat - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/23/Bihar%20AIMIM%20MLA.jpg.webp?itok=SyibUL8E)
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ)
హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ
ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment