
ఉత్తరప్రదేశ్: రాజస్థాన్లో బిపర్ జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంటే.. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే బల్లియా జిల్లా ఆస్పత్రిలో 54 మంది మృతి చెందారు. దాదాపు 400 మంది తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు వేరువేరు కారణాలున్నప్పటికీ ఎండ తీవ్రత ఓ కారణమని వైద్యులు చెప్పారు.
రోజురోజుకూ వేడితీవ్రత ఎక్కువగా..ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎండలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
జూన్ 15న 23 మంది మరణించగా..ఆ మరుసటి రోజు 20 మంది మృతి చెందారు. కాగా.. శనివారం 11 మంది ప్రాణాలు పోయాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే యాదవ్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి ఏదైనా వ్యాధి కారకమా? అని తెలుసుకోవడానికి లక్నో నుంచి ఓ బృందం వస్తోందని అడినల్ హెల్త్ డైరెక్టర్ డా.బీపీ తివారీ తెలిపారు.
వేడి, చలి పెరిగినప్పుడు శ్వాసకోశ సమస్యలు, డయాబెటిస్, బీపీ విపరీతంగా పెరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు పెరగడమే తాజా మృతులకు కారణమని వెల్లడించారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో స్ట్రెచర్స్ లేమి కారణంగా రోగులను బంధువులు భుజాలపై మోసిన సందర్భాలు ఎదురయ్యాయని చెప్పారు.
ఇదీ చదవండి:అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
Comments
Please login to add a commentAdd a comment