
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాలను నిరశిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 అనంతరం రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమిస్తోంది. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసాకాండ అనంతరం ఇంటి ముఖం పట్టిన వేలాది మంది రైతులు మళ్లీ ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘజీపూర్, టిక్రి ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ (అంతర్జాలం) సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దేశ రాజధాని సమీపంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్నెట్ను నిలిపిస్తున్నట్లు హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. (స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు!)
మరోవైపు రైతు దీక్షల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ రూపంలో ఉగ్రదాడి పొంచి ఉందన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై కేంద్రం అప్రమత్తమైంది. సీఎం వ్యాఖ్యలపై ఇంటిలిజెన్స్ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. మరోవైపు యూపీ గేట్ పరిసరాలను ఖాళీ చేయాలన్న స్థానిక మెజిస్ట్రేట్ ఉత్తర్వును ధిక్కరిస్తూ వందలాదిమంది బీకేయూ(భారతీయ కిసాన్ యూనియన్) సభ్యులు యూపీగేట్ వద్దకు చేరుకుంటున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు స్థానిక ప్రభుత్వం కరెంట్ కోతతో సహా పలు యత్నాలు చేస్తోంది. ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే నిరసన ప్రదేశాన్ని సందర్శించి.. ఆర్ధరాత్రి కల్లా స్థలాన్ని ఖాళీ చేయాలనిమౌఖికంగా ఆదేశించారు. దీంతో ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.