
బెంగళూరు: దేశమంతటా కోవిడ్-19 కేసులు(Covid-19 cases) పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా పిల్లలు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దని కోరింది.
ఈ ప్రకటన విడుదల చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని విద్యా సంస్థలలో(educational institutions) ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రకటనను వెలువరించింది. ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు పాఠశాలలకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ తగిన వైద్య సంరక్షణ పొందాలని తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కోవిడ్-19 సమీక్షా సమావేశం అనంతరం పాఠశాలలకు ఈ ఆదేశాలను జారీ చేశారు.
చిన్నారులలో జ్వరం, దగ్గు, జలుబు(Fever, cough, cold) లేదా ఇతర లక్షణాలు గమనించినప్పుడు వారి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తగిన చికిత్స అందించి, కోలుకున్నాకనే పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు పాఠశాలల్లో కోవిడ్-19 వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించడం, మాస్క్లు ధరించడం శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం లాంటివి అమలు చేయాలని సూచించింది. కర్ణాటకలో 230కి పైగా కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. పాక్తో సంబంధాలపై ఆరా