
సాక్షి, బెంగళూరు : కరోనా రెండో దశ ప్రబలే ప్రమాదం ఉండటంతో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోవిడ్ సాంకేతిక సలహా సమితి సిఫార్సుల మేరకు క్రిస్మస్, న్యూ ఇయర్తో పాటు ధార్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, వివాహాది శుభకార్యాల్లో ఎక్కువమంది ప్రజలు చేరకుండా నిషేధాజ్ఞలు విధించే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ సాంకేతిక సలహా సమితి సభ్యులతో శుక్రవారం సమావేశమైన ఆరోగ్య, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడారు. చదవండి: (8న భారత్ బంద్)
వివాహానికి వందమంది, రాజకీయపార్టీలు సభలు సమావేశాలకు 200 మంది, అంత్యక్రియలకు 50 మందిని పరిమితం చేయాలని డాక్టర్ సుదర్శన్ నేతృత్వంలోని కోవిడ్–19 సాంకేతిక సలహా సమితి నివేదిక అందించిందన్నారు. ఈ నివేదిక అమలుపై సీఎంతో చర్చించి తీర్మానం చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి కర్ఫ్యూ విధించే ప్రతిపాదన ప్రభుత్వం ముందులేదన్నారు. డిసెంబరు 20 నుంచి జనవరి 2 వరకు మార్గదర్శకాలు పాటించాలన్నారు.