
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు.