కార్‌ ఆసుపత్రిలో విధ్వంసం | Miscreants disrupt midnight protest against Kolkata doctor rape-murder case | Sakshi
Sakshi News home page

కార్‌ ఆసుపత్రిలో విధ్వంసం

Published Fri, Aug 16 2024 5:29 AM | Last Updated on Tue, Aug 20 2024 11:18 AM

Miscreants disrupt midnight protest against Kolkata doctor rape-murder case

అర్ధరాత్రి వేళ లోపలికి చొరబడి రెచి్చపోయిన దుండగులు   

కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి  

సీసీటీవీ కెమెరాలు, వైద్య పరికరాలు ధ్వంసం  

పోలీసుల్ని వెంటాడి వారిపైకి రాళ్లు రువ్విన వైనం

హత్య కేసు ఆధారాల మాయానికి ప్రయత్నం 

ఇప్పటిదాకా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ ఆర్‌.జి.కార్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. 

ఎమర్జెన్సీ, ఔట్‌ పేషెంట్స్‌ వార్డులు, నర్సింగ్‌ స్టేషన్, మెడిసిన్‌ స్టోర్‌లో పరికరాలు, ఔషధాలను చిందరవందర చేశారు. హత్య కేసు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయతి్నంచారు. సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. జూనియర్‌ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న వేదికను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. పై అధికారులకు సమాచారం చేరవేయడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసుల రాకను గమనించిన దుండగులు రాళ్లు విసిరారు. 

దాంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 40 మందికిపైగా దుండగులు నిరసనకారుల రూపంలో ఆసుపత్రిలోకి ప్రవేశించారని పోలీసు అధికారులు చెప్పారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనంతోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. కొందరు పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. ఇప్పటిదాకా 12 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.  

రోగుల హాహాకారాలు  
ఆసుపత్రి వార్డుల్లో దుండగులు వీరవిహారం చేస్తుండడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. చికిత్స పొందకుండానే కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. విలువైన వైద్య పరికరాలు, ఔషధాలను దండుగులు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. విధ్వంసం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నర్సులకు కేటాయించిన వార్డుల్లో ఆశ్రయం పొందారు. తమను దాచిపెట్టండి అంటూ ఇద్దరు పోలీసులు వేడుకున్నారని ఓ నర్సు చెప్పారు.

నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు, నర్సులు  
ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల వీరంగం పట్ల డాక్టర్లు, నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. తమకు భద్రత కలి్పంచాలని డిమాండ్‌ చేశారు. తమపై దాడులను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. పోలీసుల సమక్షంలోనే దుండగులు రెచ్చిపోయారని, తమపై చెయ్యి చేసుకున్నారని ఆరోపించారు. తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఉద్యమాన్ని విరమించుకొనేలా చేయాలన్నదే వారి ప్రయత్నమని చెప్పారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

దుమ్మెత్తిపోసుకున్న మమత, బీజేపీ
ఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్‌ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్‌ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.

రేపు వైద్యుల దేశవ్యాప్త సమ్మె
వైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచి్చంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.   మరోవైపు దీనిపై నిరసనలు కొనసాగించాలని ఫోర్డా నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర మంత్రి నుంచి జేపీ నడ్డా లిఖితపూర్వక హామీ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

సీబీఐ దర్యాప్తు వేగవంతం   
వైద్యురాలి కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి హత్యపై వివరాలు సేకరించారు. ఆమె స్నేహితుల గురించి ఆరా తీశారు. కార్‌ ఆసుపత్రి వైద్యులతోనూ మాట్లాడారు. మాజీ మెడికల్‌  సూపరింటెండెంట్, వైస్‌ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, ఛెస్ట్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ను విచారించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement