
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.
హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదివారం సుమిత్కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment