
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు.
హెల్ప్డెస్క్ సిబ్బంది స్పందించాలి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్డెస్క్లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు.
బాధిత కుటుంబీకులకు సమాచారం
కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు.
ఇంటింటి సర్వే
అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.