
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు కోర్టు ఒక రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం రూపాయిని సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ఈ రోజు సుప్రీంకోర్టుకు రూ.1 చెల్లించాను. అంతమాత్రానా నేను కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించినట్లు కాదు. నేను దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తాను’ అని తెలిపారు. ఈసారి ఈ కేసుపై మరొక బెంచ్తో విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించగా ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. అది చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈరోజు తనకు విధించిన జరిమానా రూ.1 ను డిపాజిట్ చేశారు. సెప్టెంబర్ 15 కల్లా జరిమానాను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలపాటు జైలుకు వెళ్లాల్సి వుంటుందని కూడా తెలిపింది. ఇక ప్రశాంత్ భూషణ్ 2009లో గతంలో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు అవినీతిపరులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కోసం ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు ఉంది.