
న్యూఢిల్లీ: మనదేశంపై శత్రుదేశాలు దాడి చేస్తే, వారికి తగిన రీతిలో బుద్ధి చెపుతామని, తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో తలెత్తిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనాను ఉద్దేశించి రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. భారత దేశం ప్రజల హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటుందే తప్ప, భూభాగాల ఆక్రమణను కాదని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతా దళాలకిచ్చిన సందేశంలో రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. (101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం)
దాని అర్థం తమ స్వీయ గౌరవానికి భంగం కలిగితే భరిస్తామని కాదని రక్షణ మంత్రి ఆ సందేశంలో స్పష్టం చేశారు. ‘‘దేశ రక్షణకు మాత్రమే మేం ఏదైనా చేస్తాం, ఇతర దేశాలపై దాడులు మా లక్ష్యం కాదు’’అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఏ దేశ భూభాగంపై భారత్ దురాక్రమణకు పాల్పడలేదని, దానికి చరిత్రే సాక్ష్యమని మంత్రి చెప్పారు. సైనిక సిబ్బంది అవసరాలు తీర్చడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన అన్నారు.