
రాబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 370కు పైగా సీట్లను గెలుస్తుందని ఇటీవల ఆయన ప్రకటించారు.
మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఇంకా ఖరారు కాలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే బీజేపీ కాంగ్రెస్లు ఇంకా ఎవరి పేరును ప్రకటించలేదు. కాగా తాజాగా మీడియాకు అందిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్లోని విదిశ లోక్సభ స్థానం టిక్కెట్ను బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
విదిశ జిల్లా జనాభా దాదాపు 14.5 లక్షలు. ఇక్కడ 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి ఇక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన రమాకాంత్ భార్గవ విదిశ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనకు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై రమాకాంత్ భార్గవ విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 12,50,244 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3,49,938 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రమాకాంత్ భార్గవకు 8,53,022 ఓట్లు దక్కాయి.
మధ్యప్రదేశ్లోని ఇతర స్థానాల మాదిరిగానే విదిశలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎవరిని బరిలోకి దింపుతాయో అధికారికంగా ఇంకా నిర్ణయం వెల్లడికాలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ విషయానికొస్తే విదిశ అతని సొంత జిల్లా. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన విదిశ నుంచి ఐదుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆయనకు విదిశ టిక్కెట్ ఇవ్వనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment